తిరుపతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో చేసిన వ్యాఖ్యలు సీమ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షుడు పురుషోత్తమ రెడ్డి అన్నారు.
అమరావతి రాజధాని అయినా నామనసులో మాత్రం కర్నూల్ రాజధాని అంటూ మీరు గతంలో చేసిన ప్రకటనతో రాయలసీమ ప్రజలలో కొత్త ఆశలు చిగురించాయనీ, నేడు ఈ విధంగా మాట్లాడటం బాధాకరమని పురుషోత్తమ రెడ్డి అన్నారు.
గురువారం భీమవరంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ ‘ భీమవరం పట్టణంలోకి పులివెందుల అల్లరిమూకలు ప్రవేశిస్తే తరిమికొడతా’ అంటూ చేసిన వ్యాఖ్యలపై పురుషోత్తమ రెడ్డి స్పందించారు.
పవన్ వ్యాఖ్యలు అభ్యంతరకరం అని పురుషోత్తమరెడ్డి అన్నారు. రాయలసీమ ప్రజలను పవన్ అవమానించారని ఆయన పేర్కొన్నారు.
రాయలసీమ ప్రజలపై నిందలు వేయడం హీరోయిజమా అని పురుషోత్తమ రెడ్డి ప్రశ్నించారు.
‘వ్యక్తిగతంగా సినీ హీరో అయిన పవన్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హీరోయిజం అంటే ఇతరులపై నిందలు వేయడం కాదు. తన వారికి , తన చుట్టూ ఉన్న వారికి మేలు చేసి అభిమానం పొందడం. కానీ పవన్ అందుకు భిన్నంగా జగన్ మీదా రాయలసీమ ప్రజల మీదా నిందలు వేయడం ద్వారా విజయం సాధించాలనుకుంటున్నారు. 2014 లో తన మద్దతుతో అధికారంలోకి వచ్చిన బాబు ప్రభుత్వంతో దాదాపు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నపుడు భీమవరంకి ఏం చేశారు, విడిపోయిన తర్వాత ఏ సమస్య పరిష్కారానికి పోరాటం చేశారు, తనను గెలిపిస్తే భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారు. ఇవి చెప్పి అక్కడ ప్రజల మద్దతు పొందవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ సంబంధం లేని పులివెందుల ప్రజలపై నిందలు వేసి రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇతరుల మీద నెపం మోపి తాను హీరో కావాలనుకుంటే అంతకన్నా దుర్మార్గం మరోటి ఉండదు. తనకు, తన కుటుంబానికి పెద్ద దిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవిని మీ స్వంత ప్రాంతం ప్రజలు ఓడిస్తే రాయలసీమ ప్రజలు తిరుపతి నుంచి గెలిపించి మీకు రాజకీయ బిక్ష పెట్టారు. అలాంటి ప్రాంతంపైనా మీరు నిందలు వేసేది’ అని పురుషోత్తమ రెడ్డి ప్రశ్నించారు.
తల్లి కోసం ఫ్యాక్షన్ చేయని జగన్ భీమవరంకి పులివెందుల మనుషులను పంపుతారా ? అని ఆయన ప్రశ్నించారు.
‘2014 ఎన్నికల్లో జగన్ తన తల్లి విజయమ్మను విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. అప్పుడు కూడా మీరు ఇలాంటి విమర్శలే చేశారు. విజయమ్మ గెలిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదనీ , పులివెందుల గుండాలు అశాంతిని కలిగిస్తారని ప్రచారం చేశారు. ప్రజలు కూడా నమ్మారు పలితం విజయమ్మ ఓడిపోయారు. తన తల్లి స్వయంగా పోటీ చేసినా తను పుట్టిన ప్రాంతంపై మీరు విమర్శలు చేస్తున్నా జగన్ పులివెందుల మనుషులను పంపారా లేదే. నాటి ఎన్నికల్లో ఒక్క హింసాత్మక సంఘటన చోటుచేసుకోలేదు. తన తల్లి కోసం ఫ్యాక్షన్ చేయని జగన్ తనకు పోటీ కానీ మిమ్మల్ని ఓడించడానికి పులివెందుల మనుషులను పంపుతారా పవన్ ఒకేసారి ఆలోచించండి’ అని పురుషోత్తమ రెడ్డి హితవు పలికారు.
విశాఖలో నేడు చోటు చేసుకున్న పరిణామాలకు కారణం ఎవరో మీరు చెప్పాలి అని పురుషోత్తమ రెడ్డి పవన్ ను డిమాండ్ చేశారు.
‘నేడు విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం కాబడ్డాయి. శాంతి భద్రతలు సైతం సరిగా లేవని మీరే అనేక సార్లు విమర్శలు చేశారు. ఆందోళన కూడా చేశారు. ఏ పులివెందుల గుండాలు అందుకు కారణమో చెప్పగలరా . ఈ మొత్తం వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంది మీరు పెంచి పోషించిన వారు కాదా. అదే పులివెందుల ప్రాంతం నుంచి ఎన్నికైన వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే కదా విశాఖపట్నం గ్రేటర్ అయినది నాటి పాలనలో నేటి పరిణామాలు చోటు చేసుకున్నాయా పవన్ సమాధానం చెప్పాలి’ అని పురుషోత్తమ రెడ్డి డిమాండ్ చేశారు.
‘జగన్ రాజకీయాలుపై ఏ విమర్శలు చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ జగన్ పై కోపంతో వారు పుట్టిన రాయలసీమ ప్రజలపై నిందలు వేయడాన్ని సీమ సమాజం అంగీకరించదు’ అని పుసరుషోత్తమ రెడ్డి పేర్కొన్నారు.
తమకు ఏమి చేశారు , ఏమి చేయబోతున్నారో చెప్పకుండా రాయలసీమ ప్రజలపై విషం చిమ్మితే విజ్ణత కలిగిన భీమవరం ప్రజలు కూడా హర్షించరు. దీన్ని మీరు గుర్తించితే మీకే మంచిదని పురుషోత్తమ రెడ్డి హితవు పలికారు.