ఢిల్లీ: రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందం కేసు రివ్యూ పిటిషన్పై సుప్రీం ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు శుక్రవారం పిటిషన్పై వాదనలు ముగిసాయి. వాదనలు వినిపించేందుకు రెండు పక్షాలకు చెరో గంట సమయాన్ని ధర్మాసనం కేటాయించింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరీ, వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. అటర్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ కేంద్రం తరుపున వాదనలు వినిపించారు.
రఫేల్ కొనుగోళ్ల ఒప్పందానికి సంబంధించి పునః విచారణ అవసరం లేదని పేర్కొంటూ గత వారం కేంద్రం ప్రమాణపత్రం దాఖలు చేసింది. రఫేల్ కొనుగోలు ఒప్పందంలోే అవినీతి జరిగిందనడానికి ఆధారాలు లేవని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అనంతరం ది హిందూ దినపత్రిక రఫేల్ ఒప్పందానికి సంబంధించిన రహస్యపత్రాలను ప్రచురించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అనేక అక్రమాలు జరిగినట్లు ఆ పత్రాల ద్వారా తెలిసింది. వాటి ఆధారంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలయింది.
రహస్యపత్రాలు అక్రమంగా బయటకువచ్చాయి కాబట్టి వాటిని అధికారికంగా పరిగణించేందుకు వీలు లేదని కేంద్రం వాదించింది. పత్రాలు చోరీ చేసినందుకు ద హిందూపై కేసు పెడతామని కూడా పేర్కొన్నది. అయితే పత్రికా స్వేచ్ఛను పరిరక్షిస్తూ, ఆ పత్రాలు సాక్ష్యంగా చెల్లుబాటవుతాయని సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించింది. దానితో రివ్యూ పిటిషన్ విచాకణకు వచ్చింది. ఈ కేసులో తమకు అనుకూలంగా తీర్పు రావడానికి కేంద్రం సుప్రీం కోర్టును తప్పుదారి పట్టించిందనీ, మోసానికి పాల్పడిందని పేర్కొంటూ గురువారం మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు ధర్మాసనం ముందు రీజాయిండర్ దాఖలు చేశారు.
శుక్రవారం పిటిషన్పై వాదనలు ముగిసిన అనంతరం ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.