(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ ఆరు నెలలు పోతే దేశంలోని యవత ప్రధాని నరేంద్ర మోదీని కర్రలతో కొట్టి బయటకు విసిరేస్తారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బిజెపి లోక్సభను స్తంభింపజేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష్ వర్ధన్ శుక్రవారం స్పీకర్ ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా రాహుల్ వ్యాఖ్యలపై రచ్చకు దారి తీశారు.
ఫలితంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎంపీలు కొట్టుకున్నంత పని చేశారు. కాంగ్రెస్ ఎంపీలు తన సీటు దగ్గరకు వచ్చి దాడికి ప్రయత్నించారని హర్ష్ వర్ధన్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ దీనిని ఖండించారు. నిజానికి బిజెపి ఎంపీలే బలప్రయోగం చేయబోయారని ఆయన ఆరోపించారు.
వైద్య కళాశాలలపై రాహుల్ గాంధీ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు లేచిన మంత్రి ఆ పని చేయకుండా ప్రధానిపై రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక ప్రకటన చదవడం మొదలుపెట్టారు. స్పీకర్ ఓం బిర్లా వద్దన్నప్పటికీ ఆయన పట్టించుకోలేదు. దానితో కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం టాగోర్ మంత్రి దగ్గరకు దూసుకువెళ్లారు. బిజెపి ఎంపీలు ఆయనను నిలువరించారు.
ఇంత గొడవ జరుగుతున్నా హర్ష్ వర్ధన్ తన ప్రకటన చదవడం ఆపలేదు. రాహుల్ వ్యాఖ్యలను సభ ఖండించాలని ఆయన కోరారు. గందరగోళం మధ్య స్పీకర్ సభను వాయిదా వేశారు.
సభ వెలుపల రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ తన గొంతు నొక్కేందుకే సభ వెలుపల తానన్న మాటలను మంత్రి సభలో ప్రస్తావించారని అన్నారు. తర్వాత ఆయన ట్విట్టర్లో కూడా దీనిపై పోస్టు చేసారు.