లోక్సభలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కాపలాదారే దొంగ అన్న తన అభియోగాన్ని పునరుద్ఘాటించారు. ‘ద హిందూ’ దినపత్రికలో రఫేల్ ఒప్పందంపై నేడు ప్రచురించిన కధనం ఆయనకు కలిసి వచ్చింది.
ఒకపక్క రక్షణ శాఖ బృందం రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతుండగా, ప్రధాని కార్యాలయం అధికారులు సమాంతరంగా చర్చలు జరిపిన విషయాన్ని ‘ద హిందూ’ బయటపెట్టింది. ఈ సమాంతర చర్చలకు రక్షణ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఆ పత్రిక తెలిపింది.
రాహుల్ ఈ కధనం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రధాని కార్యాలయం ఒప్పందం తాలూకూ చర్చల్లో పాలు పంచుకున్న విషయాన్ని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పలేదు కాబట్టి ద హిందూ కధనం నేపధ్యంలో రఫేల్ ఒప్పందంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే ప్రశ్నార్ధకం’ అని రాహల్ వ్యాఖ్యానించారు.
ప్రధాన మంత్రి రఫేల్ విషయంలో రక్షణ మంత్రిని పక్కన పెట్టారని రాహుల్ గాంధీ పదేపదే ఆరోపిస్తూ వచ్చారు. నిన్న పార్లమెంటులో ప్రధాని తీవ్ర స్వరంతో కాంగ్రెస్పై, ప్రత్యేకించి గాంధీ నెహ్రూ కుటుంబంపై విరుచుకు పడ్డారు. ‘వారు రఫేల్పై ఎందుకంతగా అబద్ధాలు చెబుతున్నారో నాకు ముందు అర్ధం కాలేదు. తర్వాత అర్ధమయింది. ఇన్ని సంవత్సరాలుగా వారు కుదిర్చిన ఒప్పందాల్లో ఎక్కడా నిజాయితీ లేదు. మామయ్యో బాబాయో ఎవరో ఒకరు రక్షణ ఒప్పందాల్లో ప్రత్యక్షం అయ్యే వారు’ అని మోదీ అన్నారు.
నేడు రాహుల్ గాంధీ మోదీని అదే తీరున ప్రశ్నించారు. ఒకపక్క రక్షణ శాఖ చర్చలు జరుపుతుండగా ప్రధాని కార్యాలయం ఎవరి తరపున జోక్య చేసుకుందని ఆయన ప్రశ్నించారు. ‘మీకోసమో నాకోసమో కాదు. అనిల్ అంబానీ కోసం. కాపలాదారే దొంగ అని దీని వల్ల రుజువవుతున్నది’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘చిదంబరాన్ని ప్రాసిక్యూట్ చేయండి. రాబర్ట్ వాడ్రాపై అభియోగాలు మోపండి. కానీ రఫేల్పై జవాబులు ఇవ్వండి’ అని ఆయన అన్నారు.
రక్షణ సిబ్బందిని ఉద్దేశించి రాహుల్ ఇలా అన్నారు. ‘మీరు మాకోసం పోరాడతారు. మాకోసం మరణిస్తారు. మీకు ఈ విషయం తెలియాలి. ప్రధాని మీ డబ్బు 30 వేల కోట్ల రూపాయలు చోరీ చేసి తన మిత్రుడు అనిల్ అంబానీకి ఇచ్చారు’.
లోక్సభలో హిందూ కథనం దుమారం రేపింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ప్రతిపక్షాలు చచ్చిపోయిన గుర్రంపై కొరడా ప్రయోగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ద హిందూ పత్రిక కాంగ్రెస్తో కలిసి కుట్ర పన్నిందని ఆమె అన్నారు. హిందూ కథనంలో పేర్కొన్న నోట్కు ఆనాటి రక్షణ మంత్రి పరికర్ ఏం జవాబిచ్చిందీ ఆ పత్రిక ఎందుకు ప్రచురించలేదని ఆమె ప్రశ్నించారు.
ఆనాటి రక్షణ మంత్రి పరికర్ ఆ నోట్ తనవద్దకు వచ్చినపుడు అయిదవ పేరా కాస్త ఓవర్ రియాక్షన్ లాగా కనబడుతోందని దానిపై రాశారు.
ఈ నోట్ను ఎఎన్ఐ ట్వీట్ చేసింది.
ప్రధాని కార్యాలయం అప్పుడప్పుడూ పర్యవేక్షించడాన్ని జోక్యం అంటామా అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. ఆమె జవాబును కాంగ్రెస్ తిప్పి కొట్టింది. నేరుగా ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరపడం పర్యవేక్షణ కిందకు రాదనీ, నిర్మల నటించడం మానుకోవాలనీ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
Nirmala ji, stop pretending like you don't know that negotiating directly with the French govt is not 'supervision", but interference which violates DAC guidelines as illustrated by the note written by your own ministry. #PakdaGayaModi https://t.co/cCfPlQB2M2
— Congress (@INCIndia) February 8, 2019