(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీలో ఇసుక వెబ్సైట్ను బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ హ్యాక్ చేసిందని.. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించిందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బ్లూ ఫ్రాగ్ ఆఫీసులో తనిఖీలు చేసిన సీఐడీ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. అయితే, ప్రభుత్వ ఇసుక వెబ్సైట్ను హ్యాక్ వ్యవహారం వెనుక టీడీపీ హస్తం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది.
ఏపీలో పారదర్శకంగా ఇసుక పంపిణీ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మనశాండ్ పోర్టల్ హ్యాక్ చేసి, కృతిమ కొరత సృష్టించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ఇసుక సరఫరాకు సంబంధించిన వెబ్సైట్ను హ్యాక్ చేసినట్టు విశాఖ నగరంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థపై ఫిర్యాదులు రావడంతో సీఐడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సర్వర్ని హ్యాక్ చేసి కోడ్ ద్వారా ఇసుక అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. కంపెనీ సర్వర్లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంత ఇసుకను బ్లాక్ చేశారు? ఎవరికి ఆర్థిక ప్రయోజనాలు అందాయి? ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లింది? అనే దానిపై ఆరా తీస్తోంది. నిజానికి ఇసుక డంపింగ్ యార్డుల్లో ఉన్నప్పటికీ వెబ్ సైట్లలో మాత్రం అవి కనిపించట్లేదు. దీంతో కావాలని కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు తేల్చారు. బ్లూ ఫ్రాగ్ సంస్థ గతంలో కూడా డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కొంది.
ఏపీలో కొత్త ఇసుక విధానానాన్ని అమల్లోకి తెచ్చిన సీఎం జగన్.. మన శాండ్ పోర్టల్ ప్రారంభించారు. దాని ద్వారా ప్రజలు ఆన్లైన్లో ఇసుక కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. అందుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ను రూపొందించారు. ఆ పోర్టల్ను బ్లా ఫ్రాగ్స్ సంస్థే నిర్వహిస్తోంది. ఐతే సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులు సైట్ను హ్యాక్ చేసి అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారని తేల్చే పనిలో ఉంది సీఐడీ.
టీడీపీ హయాంలో ఇసుక సరఫరాకు సంబంధించి మన శాండ్ పేరుతో యాప్ను బ్లూ ఫ్రాగ్ సంస్థ నిర్వహించేది. సరిగ్గా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేశారనే ఆరోపణలపై బ్లూ ఫ్రాగ్పై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. ఇదిఇలా ఉంటే ఏపీలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడేలా మాజీ సీఎం చంద్రబాబు కుట్ర పన్నారని వైసీపీ ఆరోపించింది. తనకు ఎంతో సన్నిహితంగా ఉన్న విశాఖ బ్లూ ఫ్రాగ్ కంపెనీతో ఇసుక సరఫరాకు సంబంధించిన ప్రభుత్వ వైబ్ సైట్ ను హ్యాక్ చేయించారని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. ఇసుక అందుబాటులో వస్తున్న సమయంలో కావాలని వెబ్ సైట్ ను హ్యాక్ చేయించి కొరత ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.
మరోవైపు బ్లూ ఫ్రాగ్ సంస్థ నారా లోకేశ్ సన్నిహితుడి కుటుంబీకులకు చెందినదని ఆరోపణలు వినిపించాయి. అయితే, ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో శాండ్ పోర్టల్ హ్యాక్ వెనుక ఎవరున్నారనే దిశగా సీఐడీ దర్యాప్తు చేస్తోంది.