న్యూఢిల్లీ: కశ్మీర్లో రానున్న కొద్ది రోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మీడియాపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తవేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టినపుడు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ఈ మాట చెప్పారు. కశ్మీర్ టైమ్స్ పత్రిక ఎడిటర్ అనూరాధా భాసిన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
కశ్మీర్లో మీడియా స్వేచ్ఛగా పని చేసుకునేందుకు వీలుగా కమ్యునికేషన్ లైన్లు వెంటనే పునరుద్ధరించాలని ఆమె పిటిషన్లో కోరారు. మీడియాలో పనిచేసేవారు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా అన్ని ఆంక్షలనూ రద్దు చేయాలని కూడా ఆమె కోరారు.
జమ్ములో ఆంక్షలు లేవనీ, కశ్మీర్ టైమ్స్ను అక్కడునుంచి ప్రచురిస్తున్నారనీ వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. కశ్మీర్ నుంచి ప్రచురణ ఆగిపోయిందని భాసిన్ తెలిపారు. మిగతా విషయాలతో పాటు మీడియాపై ఆంక్షల విషయం కూడా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. అయితే విచారణకు తేదీ ఇవ్వలేదు. రోజువారీ ప్రాతిపదికపై పరిస్థితిని సమీక్షిస్తున్నారనీ, కోర్టు సెక్యూరిటీ సంస్థలను విశ్వసించాలనీ వేణుగోపాల్ పేర్కొన్నారు.