ముంబై: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి భారీ ఆధిక్యం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభం కావడమే 950 పాయింట్లు పెరిగాయి. ఎస్ అండ్ పి, బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో 979.02 పాయింట్లు పెరిగి 38,909.79 వరకు చేరింది. ఎన్ఎస్ఈ కూడా 292.8 పాయింట్లు పెరిగి 11,699.95 వద్ద ట్రేడయింది. ఫైనాన్స్, ఆటో, ఇంధన, మెటల్ షేర్లు లాభాలను చూడటం మార్కెట్లకు అండగా నిలిచింది. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 2.23 శాతం పెరిగి 845.33 పాయింట్ల అధికంగా 38,776.10 వద్ద ట్రేడయింది. ఇక నిఫ్టీ కూడా 246.50 పాయింట్లు.. అంటే 2.16 శాతం పెరిగి 11,653.65 వద్ద ట్రేడయింది.
ఆ సమయంలో 50-స్క్రిప్ ఇండెక్సులో టాప్ గెయినర్లుగా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఎల్అండ్ టీ, ఎస్.బి.ఐ నిలిచాయి. ఇవన్నీ 4.96 నుంచి 6.69 శాతం అధికంగా ట్రేడయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్.డి.ఎఫ్.సి. చాలావరకు మార్కెట్ల ఉత్సాహానికి దోహదం చేశాయి. గురువారం మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు మార్కెట్ల ర్యాలీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకున్నారన్న అంశంపైనే మార్కెట్ల కదలికలు ఆధారపడతాయని ఐడీబీఐ క్యాపిటల్స్ కు చెందిన ఏకే ప్రభాకర్ చెప్పారు. బాగా షార్ట్ పొజిషన్ ఉంటే ర్యాలీ కూడా ఉంటుందని, ప్రస్తుతం వాల్యుయేణ్లు చవగ్గా లేకపోవడంతో అది కొద్దిసేపే నిలుస్తుందని ఆయన విశ్లేషించారు. సుస్థిర ప్రభుత్వం ఉంటేనే మార్కెట్లకు మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇతర ఆసియా మార్కెట్లలో ఈక్విటీలు కూడా స్థిరంగా ఉన్నాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు కాస్త ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఎం,ఎస్.సి.ఐ.కి చెందిన ఆసియా పసిఫిక్ బ్రాడెస్ట్ ఇండెక్స్ ప్రారంభంలో 0.6 శాతం పెరిగింది. గతవారమంతా 3 శాతం నష్టాలు చూసిన తర్వాత ఎట్టకేలకు స్థిరపడింది. జపాన్ కు చెందిన నిక్కీ ఇండెక్స్ కూడా 0.4 శాతం లాభపడింది. తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడం ఇందుకు కారణమైంది.