బెంగళూరు: తమ ప్రభుత్వం పడిపోయి వారం కూడా గడవకముందే యదియూరప్ప నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వానికి బయటినుంచి మద్దతు ఇవ్వాలన్న ప్రతిపాదన జనతాదళ్ (సెక్యులర్) లో వినబడింది.
యదియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తమ శాసనసభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్య కార్యక్రమం ఏమిటన్న దానిపై ఏకాభిప్రాయం రాలేదనీ, కొందరు బిజెపి ప్రభుత్వానికి వెలుపలినుంచి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించారనీ మాజీ మంత్రి జిటి దేవెగౌడ ఎన్డి టివికి చెప్పారు. తుది నిర్ణయం కుమారస్వామికి వదిలిపెట్టినట్లు ఆయన తెలిపారు.
మరోపక్క మాజీ ప్రధాని, జెడిఎస్ అగ్రనేత హెచ్డి దేవెగౌడ ట్విట్టర్ ద్వారా యదియూరప్పకు అభినందనలు తెలిపారు. శుక్రవారం యదియూరప్ప కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన సోమవారం శాసనసభలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు. జెడిఎస్తో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని కొట్టివేయలేనని ఆయన గతంలో ఒకసారి అన్నారు.