(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలోని కర్నూలుకు తరలిస్తారన్న వార్తలు కోస్తా జిల్లాల న్యాయవాదుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. అయిదు జిల్లాల న్యాయవాదులు నిరసన దీక్షలకు దిగారు. ఈ వార్తల్లో నిజమెంత అన్న చర్చ న్యాయవాద వర్గాలలో విస్తృతంగా జరుగుతోంది. మరోపక్క రాయలసీమలో, ప్రత్యేకించి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ అక్కడ ఎప్పటినుంచో ఉంది.
హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చెప్పినట్లు జాతీయ మీడియాలో వచ్చిన వార్త ఈ చర్చకు దారి తీసింది. దానికి తోడు ఒకే రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయడానికి తాము వ్యతిరేకమనీ, రాజధానిని వికేంద్రీకరిస్తామనీ మంత్రులు కొందరు ముందే పేర్కొనడం ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇస్తున్నది.
వైఎస్ జగన్ ప్రభుత్వం నిజంగానే హైకోర్టును తరలించే యోచనలో ఉందేమో కానీ ప్రభుత్వ వర్గాల దగ్గర మాత్రం దీనికి సంబంధించిన సమాచారం ఏమాత్రం లేదు. ఒకవేళ ఆ యోచన ఉండిఉంటే ముఖ్యమంత్రి దానిని ఇప్పటివరకూ ఎవరితోనూ పంచుకోలేదనుకోవాలి.
అమరావతిలో నడుస్తున్న హైకోర్టును మరో చోటికి తరలించాలంటే దానికి కొంత తతంగం ఉంది. సాధారణంగా అయితే కొత్త హైకోర్టు ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ప్రకారం ఏర్పాటవుతుంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో తలెత్తిన కొన్ని సమస్యల కారణంగా ఉమ్మడి హైకోర్టు విభజన, ఎపి హైకోర్టు ఏర్పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జరిగాయి. ఇప్పుడు హైకోర్టును తరలించాలంటే మళ్లీ సుప్రీంకోర్టు ఆమోదం కావాలన్న వాదన ఉంది. ఆ అవసరం లేదన్న వాదనా ఉంది.
ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు అమరావతిలో, అందులోనూ నేలపాడులో నిర్మించిన భవనంలో ఏర్పాటు కావాలని హైకోర్టు ఫుల్ బెంచ్ ముందు తీర్మానం చేసింది. ఈ ప్రకారం నోటిఫికేషన్ జారీ అయింది. ఇప్పుడు హైకోర్టు తరలించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో హైకోర్టు మళ్లీ దానికి సంబంధించిన తీర్మానం చేయాల్సిఉంటుంది. అంతిమంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపని పక్షంలో అడుగు ముందుకు పడదు.