చెన్నై: ఏపిలో వారం వ్యవధిలో ఇద్దరు కీలక నేతల్ని టిడిపి కోల్పోయింది. ఇటీవలే ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే టిడిపిలో మరో విషాదం నింపింది. తాజాగా చిత్తూరు మాజీ ఎంపీ, సినీ నటుడు నారమల్లి శివప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్ ఆరోగ్యం విషమించడంతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, శివప్రసాద్ చనిపోయినట్టు నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిని ఆయన అల్లుడు నరసింహ ప్రసాద్ ఖండించారు. శివప్రసాద్ ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపారు. అయితే, ఇవాళ శివప్రసాద్ చనిపోయినట్టు కుటుంబసభ్యులు అధికారికంగా ధ్రువీకరించారు.
1951 జూలై 11న చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పులిత్తివారిపల్లి గ్రామంలో శివప్రసాద్ జన్మించారు. శివప్రసాద్కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. సినీ రంగం నుంచి రాజకీయల్లోకి వచ్చారు. శివప్రసాద్ 1999-2004 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999-2001 మధ్య సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు చిత్తూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు. స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపేవారు.
ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపేవారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు. గత 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. స్వతహాగా రంగస్థల నటుడైన శివప్రసాద్ పలు సినిమాల్లో నటించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించారు. కుబేరులు, ఆటాడిస్తా, ఒక్కమగాడు, డేంజర్, కితకితలు, జైచిరంజీవ, పిల్ల జమీందార్, బలాదూర్ సినిమాలతోపాటు మరెన్నో చిత్రాల్లో నటించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.
శివప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం పార్టీకి తీరని లోటు.— N Chandrababu Naidu (@ncbn) September 21, 2019
శివప్రసాద్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నా చిరకాల మిత్రుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ నేత, డా.ఎన్ శివప్రసాద్ గారి మరణం విచారకరం. ప్రత్యేకహోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం ఆయన రాజీలేని పోరాటం చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటు’ అని ట్వీట్ చేశారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం టీడీపీకి తీరని లోటని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.