న్యూఢిల్లీ: కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారంపై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు శుక్రవారం ఎలాటి ఆదేశాలూ జారీ చేయలేదు. దానితో రాజీనామాలపై యధాతధస్థితి కొనసాగుతోంది. విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ఆదేశానుసారం నిన్న సాయంత్రం 11 మంది శాసనసభ్యులు స్పీకర్ రమేష్ కుమార్ను కలుసుకున్నారు. తాజాగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు రాసి ఆయనకు సమర్పించారు. శాసనసభ్యులను కలిసిన వెంటనే తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజెప్పాలన్న ఆదేశం అత్యున్నత న్యాయస్థానం నుంచి ఉన్నప్పటికీ స్పీకర్ అందుకు నిరాకరించారు. తాను మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోలేనని ఆయన మీడియాతో అన్నారు.
ఈ రోజు విచారణ కొనసాగించిన ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం, రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని వ్యాఖ్యానించింది. రాజీనామాలపై నిర్ణయం తన పరిధిలోనే ఉంటుందనీ, కోర్టు పరిధిలోకి రాదనీ స్పీకర్ అనుకుంటున్నారా అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది.
సుప్రీంకోర్టు ఆదేశానుసారం గురువారం సాయంత్రం కర్నాటక అసెంబ్లీలో స్పీకర్ రమేష్ కుమార్ను కలిసినపుడు ఆయన తమ రాజీనామాలను పట్టించుకోలేదనీ, గో టు హెల్ అన్నారనీ తిరుగుబాటు శాసనసభ్యులు అత్యున్నత న్యాయస్థానం ముందు మొరపెట్టుకున్నారు. అయితే స్పీకర్ తరపున కోర్టులో హాజరయిన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఆ మాట అబద్ధమని ఖండించారు.
కర్నాటక శాసనసభ ఈ రోజు సమావేశం కానున్నది. రాజీనామాకు ససేమిరా అంటున్న ముఖ్యమంత్రి కుమారస్వామి తరపున కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రాజీనామాలు ఇచ్చిన శాసనసభ్యులలో కొందరు స్కాములలో ఇరుక్కుని ఉన్నారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు.