న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశానుసారం గురువారం సాయంత్రం కర్నాటక అసెంబ్లీలో స్పీకర్ రమేష్ కుమార్ను కలిసినపుడు ఆయన తమ రాజీనామాలను పట్టించుకోలేదనీ, గో టు హెల్ అన్నారనీ తిరుగుబాటు శాసనసభ్యులు అత్యున్నత న్యాయస్థానం ముందు మొరపెట్టుకున్నారు.
కర్నాటక సంక్షోభంపై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది. రెబల్ శాసనసభ్యుల తరపున వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ ముకుల్ రోహత్గీ, స్పీకర్ ‘గో టు హెల్’ అన్నారని విన్నవించారు. అయితే స్పీకర్ తరపున కోర్టులో హాజరయిన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఆ మాట అబద్ధమని ఖండించారు.
కర్నాటక శాసనసభ ఈ రోజు సమావేశం కానున్నది. రాజీనామాకు ససేమిరా అంటున్న ముఖ్యమంత్రి కుమారస్వామి తరపున కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రాజీనామాలు ఇచ్చిన శాసనసభ్యులలో కొందరు కుంభకోణాలలో ఇరుక్కుని ఉన్నారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు.