ఢిల్లి, మార్చి 6: అయోధ్య రామ జన్మభూమి, బాబ్రి మసీదు భూ వివాదంపై మధ్యవర్తిని నియమించే నిర్ణయాన్ని సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎన్ఎ బోబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
మధ్యవర్తి నియామకంపై ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం నిర్ణయాన్ని రిజర్వులో పెడుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.
‘ఇది కేవలం భూ వివాదం మాత్రమే కాదు, మత విశ్వాసానికి, భావోద్వేగానికి సంబంధించిన అంశం,చరిత్ర గురించి మాకు చెప్పొద్దు. చరిత్ర మాకు కూడా తెలుసు. గతాన్ని మనం మార్చలేం. భారత్ పై ఎవరు దండయాత్ర చేశారు, మొఘల్ చక్రవర్తి బాబర్ ఏం చేశాడు, ఆ సమయంలో రాజు ఎవరు, అక్కడ ఉన్నది మసీదా లేకా ఆలయమా అనే విషయాలను మనం మార్చలేం. గతాన్ని మార్చే శక్తి మనకు లేదు. ప్రస్తుత వివాదం ఏమిటన్నది మనకు తెలుసు. ఈ వివాదాన్ని పరిష్కరించడమే మన ముందున్న కర్తవ్యం’ అని జస్టిస్ బాబ్డే అన్నారు.
మధ్యవర్తిని ఎర్పాటు చేయడంపై హిందూ సంఘాలు వ్యతిరేకత చూపిస్తున్నాయి. ఇస్లాం వర్గీయులు సుముఖత తెలియజేస్తున్నాయి. ‘మధ్యవర్తిని నియమించడం మాకు అంగీకారమే, పరిష్కారమేదయినా ఇరు వర్గాలను కలిపి ఉంచాలి’ అని ముస్లిం పిటిషనర్ల తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ ధర్మాసనానికి తెలిపారు.
యుపి ప్రభుత్వం మధ్యవర్తి నియామకాన్ని వ్యతిరేకించింది.
ఒక వేళ సమస్యను మధ్యవర్తికి అప్పగించేలా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే ఇరు పక్షాలు మధ్యవర్తుల పేర్లు సూచించాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ స్పష్టం చేశారు. మధ్యవర్తి పేరు లేదా మధ్యవర్తి ప్యానెల్పై రాజకీయ పార్టీలు సూచనలు చేయవద్దని ప్రధాన న్యాయమూర్తి గొగొయ్ అన్నారు.
త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వాలని మేం భావిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి గొగొయ్ తెలిపారు.
2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా రామ్లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాదు హైకోర్టులో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 14 పిటీషన్లు దాఖలు అయి ఉన్నాయి.