న్యూఢిల్లీ: కర్నాటక ఇండిపెండెంట్ శాసనసభ్యులు ఇద్దరు ఆదివారం నాడు అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఉదయం ఈ పిటిషన్ను విచారించాలన్న అభ్యర్ధన వచ్చినపుడు వెంటనే విచారణ కుదరదని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
మహా అయితే రేపు విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సోమవారం సాయంత్రం లోగా బలపరీక్ష పూర్తి చేయాలని స్పీకర్ను ఆదేశించాల్సిందిగా ఆ పిటిషన్లో కోరారు.
శాసనసభ్యుల తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మళ్లీ రెండవసారి పిటిషన్ను ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తాను తాజాగా పిటిషన్ దాఖలు చేశాననీ, దానిని ఈరోజే గానీ రేపు గానీ విచారణ చేయాలనీ ఆయన అభ్యర్ధించారు. కర్నాటకలో ఏదా ఒక సాకుతో విశ్వాసపరీక్ష వాయిదా వేస్తున్నారనీ, గతంలో విశ్వాసపరీక్ష ఎదుర్కోవాల్సిందిగా ఆదేశం ఇచ్చినపుడు మళ్లీ అదే ఆదేశం ఎందుకు ఇవ్వకూడదని ఆయన అన్నారు. దానితో మంగళవారం తగిన బెంచ్ ముందు దీనిని లిస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.