అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బిజెపిలో చేరిపోయి పార్టీకి షాక్ ఇవ్వగా నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజావేదిక నిర్మాణాన్ని కూల్చివేయాలని నిర్ణయం తీసుకొని మరోక షాక్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ కూడా పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఆయన త్వరలో బిజెపిలో చేరనున్నారనీ, ఆ పార్టీ ప్రతినిధులతో సమావేశయ్యేందుకు ఇప్పటికే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముందు వైసిపి నుండి టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కూడా పార్టీ వీడనున్నట్లు సమాచారం. నేడో రేపో రాధ జనసేన పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి గురైన టిడిపికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 26వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. కాకినాడలో ఇటీవల రహస్య సమావేశం నిర్వహించిన కాపు సామాజికవర్గానికి చెందిన టిడిపి మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వచ్చిన వంటనే ఎలాంటి బాంబు పేల్చనున్నారో తెలియని పరిస్థితి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు బిజెపి వైపు చూస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించిన సందర్భంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన అభిప్రాయాలను అక్కడ సమావేశంలో వెల్లడించకుండా విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత పార్టీ అధినేతతోనే వ్యక్తిగతంగా మాట్లాడతానని చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు వచ్చిన తరువాత గంటా ఏమి మాట్లాడనున్నారో మరి. జరుగుతున్న పరిణామాలు టిడిపి వర్గాలను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి.