అమరావతి: చిన్న వయసులో ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించి పదవీ బాధ్యతలు మోస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతీరును రాష్ట్రం అంతా గమనిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆయన నేపధ్యం, ఆయన వయస్సు అందరి దృష్టీ జగన్ మీదే కేంద్రీకరించేట్లు చేశాయి. తనను అందరూ గమనిస్తున్నారన్న విషయం జగన్కు తెలుసు. అందుకే ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
తాను పదవిలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మొదటి కలక్టర్ల సమావేశంలో జగన్ తన ఆలోచన ఎలాంటి ధోరణిలో నడుస్తుందో సూచించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వలోని గత ప్రభుత్వం చేసిన తప్పులు తాను చేయకూడదన్న ఆలోచన మొదటగా కనబడుతోంది.
గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటయిన జన్మభూమి కమిటీల వల్ల అధికారపక్షం టిడిపి ప్రజల్లో వ్యతిరేకత మూటకట్టుకున్న సంగతి జగన్కు తెలుసు. తన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ విషయాన్ని టిడిపిపై దాడికి ప్రధానంగా వాడుకున్నారు. ఇప్పుడు అదే తప్పు వైసిపి కూడా చేస్తే టిడిపికి పట్టిన గతే తమకూ పడుతుంది కాబట్టి సంక్షేమ పధకాల విషయంలో స్వపర బేధం లేకుండా వ్యవహరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇక అవినీతి విషయం. స్వయంగా జగన్పై సిబిఐ, ఇడి పెట్టిన అవినీతి కేసులు ఉన్నాయి. ఈ విషయంలో తనపై పడిన ముద్రను చెరిపేసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు. కేసుల విషయం న్యాయస్థానాలు చూసుకుంటాయి కాబట్టి తన పాలనకు మాత్రం అవినీతి మరక అంటకుండా చూసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే పదేపదే అవినీతిని సహించేది లేదన్న సందేశం పంపుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడిందని జగన్ ఎన్నికల ముందు పదే పదే ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలను నమ్మించడంలో ఆయన కొంతవరకూ కృతకృత్యులయ్యారు కూడా. క్షేత్రస్థాయిలో టిడిపి శాసనసభ్యులు చాలామంది విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన నేపధ్యంలో ప్రజలలో అధికారపక్షం పట్ల వ్యతిరేకత వచ్చింది. తన హయాంలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు చేసిన తప్పులు తాను చేయకుండా ఉండడం ద్వారా ఆయన రెండు ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ఒకటి మంచి పాలకుడని ప్రజలలో పేరు తెచ్చుకోవడం. రెండు చంద్రబాబును మరింతగా ఆత్మరక్షణలో పడవేయడం. తద్వారా ఆయనను, ఆయన పార్టీని నైతికంగా దెబ్బతీయడం. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అన్న పేరు తెచ్చుకుంటానని మొదటే ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నారు.