తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని కేసు
ఇంజంక్షన్ ఇచ్చిన బెంగళూరు కోర్టు
బెంగళూరు: తన గురించి తప్పుడు, పరువునష్టం కలిగించే వార్తలు ప్రచురించకుండా మీడియాపై దక్షిణ బెంగళూరు బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య పైచేయి సాధించారు. మొత్తం 49 ఇంగ్లిషు, కన్నడ పత్రికలు, టీవీ చానళ్లతో పాటు ఫేస్ బుక్, గూగుల్ లాంటి సామాజిక మాధ్యమాలకు కూడా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. సూర్య గురించి తప్పుడు, పరువుకు భంగం కలిగించే వార్తలు ప్రచురించద్దని, ప్రసారం చేయవద్దని తెలిపింది. సూర్య గురించి కొన్ని తప్పుడు అంశాలు మీడియాలో ప్రచారం అయినట్లు ప్రాథమికంగా గుర్తించామని కోర్టు తెలిపింది. ‘తేజస్వి సూర్యపై మీటూ కేసు’ అంటూ సాగుతున్న ట్విట్టర్ ప్రచారం కాపీని తేజస్వి సూర్య కోర్టుకు అందించారు.
మీడియా సంస్థలు ఇవే..
బెంగళూరు సివిల్ జడ్జి వద్ద దాఖలుచేసిన కేసులో సూర్య 49 మీడియా సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. వాటిలో.. ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ, దక్కన్ హెరాల్డ్, కన్నడ పత్రికలు ప్రజావాణి, కన్నడ ప్రభ, విజయ కర్ణాటక, ఉదయవాణి ఉన్నాయి. టీవీ చానళ్లలో టీవీ9, సువర్ణ న్యూస్, పబ్లిక్ టీవీ కన్నడ చానళ్లు ఉన్నాయి. వాట్సాప్, యూట్యూబ్, యాహూ ఇండియా, ఫేస్ బుక్ ఇండియా, గూగుల్ ఇండియా లాంటి సోషల్ మీడియానూ చేర్చారు. ఇంకా సీఎన్ఎన్ న్యూస్ 18, టైమ్స్ నౌ, ఇండియాటుడే, న్యూస్ ఎక్స్, రిపబ్లిక్ టీవీ లాంటి ఇంగ్లిషు చానళ్లను పేర్కొన్నారు. అభ్యర్థులపై ఇలాంటి తప్పుడు వార్తలు, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు ప్రచురించకూడదని జడ్జి గట్టిగా ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్ అనుకూల వ్యక్తులు సూర్య గురించి ‘మీటూ’ వ్యాఖ్యలు చేయడం, వాటిని మీడియాలో ప్రచారం చేయడంతో ఆయన కోర్టుకెక్కారు. స్వతహాగా న్యాయవాది కావడంతో ఈ ప్రచారాన్ని వెంటనే అడ్డుకునేందుకు ఆయన న్యాయమార్గాన్ని ఎంచుకున్నారు.