(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఎందరో ముఖ్యమంత్రులు నడిచిన నేల అది. ఎన్నో చారిత్రక నిర్ణయాలకు నిలయం ఆ ప్రదేశం. తెలుగు ప్రజల పాలనా కేంద్రంగా సేవలందించిన సచివాలయ భవనం ఇక చరిత్రలో కలిసిపోనుంది. ప్రతి రోజు వేల మంది సందర్శకులు, మంత్రుల సమీక్షలు, అధికారుల ఉరుకులు-పరుగులతో ఇప్పటివరకు కళకళలాడిన సచివాలయం ఇకపై వెలవెలబోనుంది. వాస్తుదోషమో.. లేక వసతుల లోపమో.. కారణం ఏదైనా సీఎం కేసీఆర్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఈ చారిత్రక ప్రదేశపు ఆనవాళ్లను తుడిచేసింది. పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సెక్రటేరియట్ నిర్మించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఘన చరిత్రగల తెలంగాణ సచివాలయం గురించి స్మరించుకునే వేళ ఆసన్నమైంది.
1952 లో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు కాలం నాటి నుంచి ఈ సచివాలయం సేవలందిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత నందమూరి తారక రామారావు, నాదెండ్ల భాస్కరరావు, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిల పాలన ప్రస్తుత సచివాలయం నుంచే కొనసాగింది. ముఖ్యమంత్రి కారాలయాన్ని 1994 తర్వాత సీ బ్లాక్కు మార్చారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ సచివాలయం నుంచే పాలన కొనసాగించారు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-19 వరకు ఈ సచివాలయం నుంచే పాలన కొనసాగింది. ప్రగతి భవన్ నిర్మించే వరకు సీఎం కేసీఆర్ కూడా ప్రస్తుత సచివాలయం నుండే పాలన కొనసాగించినా, ఆ తర్వాత ఆయన సచివాలయం మొహామే చూడలేదు. మంత్రివర్గ సమావేశాలు ప్రగతి భవన్ కేంద్రంగానే సాగాయి. మంత్రులు మాత్రం వచ్చిపోతూ ఉండేవారు. కానీ పాలనా కేంద్రం మాత్రం ప్రగతి భవన్ అయింది.
కొత్త సచివాలయం నిర్మించేందుకు ఇప్పుడున్న భవనాలను దాదాపుగా ఖాళీ చేశారు. తాత్కాలిక సచివాలయంగా బీర్కే భవన్కు మార్చేశారు. కొత్త సచివాలయానికి నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఎర్రగడ్డ, బైసన్ పోలో మైదానం వంటివి పరిశీలించినా.. అవి కార్యరూపంలోకి రాలేదు. చివరికి ప్రస్తుతం ఉన్న చోటే కొత్త సచివాలయాన్ని నిర్మించాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. సుమారు రూ.400 కోట్లతో ఈ కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు.
మరో రెండేళ్లలో హైటెక్, అల్ట్రా మోడర్న్ హంగులతో కొత్త సమీకృత సచివాలయం సాక్షాత్కరించనుంది. అస్తవ్యస్తంగా ఉన్న ప్రస్తుత సచివాలయం స్థానంలో ఆధునికమైన సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప్రస్తుత సచివాలయంలోని భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించనున్నారు. అన్ని హంగులు, ఆధునిక సౌకర్యాలతో, ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్నంతా కూడా కొత్త భవన సముదాయంలో పొందుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త భవనాలను రెండేళ్ళలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త సచివాలయ భవనాల నిర్మాణం కోసం ప్రస్తుత భవనాలను ఇప్పటికే ఖాళీ చేశారు. దీంతో వాటిని కూల్చేపని మొదలు పెట్టబోతున్నారు. ఏది ఏమైనా… ఉమ్మడి రాష్ట్రానికి దశాబ్దాల పాటు సేవలందించిన భవనాలు ప్రజలకు, రాజకీయనాయకులకు, అధికారులకు తీపి గుర్తలుగా మారనున్నాయి..