అమరావతి: ఉండవల్లిలోని ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసాన్ని అనధికార వ్యక్తులు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం వివాదానికి, ఉద్రిక్తతకు దారి తీసింది. టిడిపి నేతల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు.
అనుమతి లేకుండా వచ్చిన ఇద్దరు యువకులు చంద్రబాబు నివాసాన్ని డ్రోన్ కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీస్తుండటంపై సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న టిడిపి నేతలు తొండపు దశరథ జనార్థన్, దేవినేని అవినాష్ తదితర నేతలు అక్కడకు చేరుకొని పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేత నివాస ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఫోటోలు, వీడియోలు తీయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఆ వచ్చిన వ్యక్తులు ఎవరు, వారి పేర్లు, వారిది ఏ వూరు, ఎందుకు ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు అనే విషయాలను వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు.జలవనరుల శాఖ అనుమతితోనే డ్రోన్ ప్రయోగించినట్లు ప్రైవేటు వ్యక్తులు చెబుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను తమకు అప్పగించాలంటూ టిడిపి నేతలు ఆందోళన చేశారు.
ఈ నేపథ్యంలోనే దేవినేని ఉమా, వర్ల రామయ్యతో సహా పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నిజాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. పోలీసుల జీపు చుట్టుముట్టారు. కరకట్టపైనే భైటాయించి నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ ఎత్తున మొహరించిన పోలీసు బలగాలు లాఠీ చార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. పలువురు టిడిపి కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.