శ్రీనగర్: ‘దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ మా కశ్మీరీలను బోనులో జంతువుల్లాగా బంధించారు. కనీస మాత్రపు హక్కులు లేకుండా చేశారు. ఊహాతీతమైన అణచివేత ఎదురయినపుడు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో పౌరులకు మాట్లాడే హక్కు కూడా లేదా’ ఈ మాటలు రాసింది ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె. ఆమె తల్లిని అరెస్టు చేసిన జమ్ము కశ్మీర్ ప్రభుత్వం కుమార్తెను గృహ నిర్బంధంలో ఉంచింది.
జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని అరెస్టు చేసిన తర్వాత ఆమె కుమార్తె ఇల్తిజా జావేద్ను గృహనిర్బంధంలో ఉంచారు. తన ఇంటి నుంచి ఆమె కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఒక వాయిస్ మెసేజ్ కూడా పంపించారు.
తనను ఇంటి బయటకు అడుగు పెట్టనివ్వడం లేదనీ, తన ఇంటికి వచ్చిన వారిని భద్రతా సిబ్బంది గేటు బయటనుంచే పంపించివేస్తూ ఎవరు వచ్చిందీ మాట మాత్రంగా కూడా చెప్పడం లేదనీ ఆమె ఫిర్యాదు చేశారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన కారణంగా తనను అరెస్టు చేసినట్లు సెక్యూరిటీ సిబ్బంది చెప్పారనీ, మరోసారి మీడియాతో మాట్లాడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారనీ ఇల్తిజా పేర్కొన్నారు. నిజానికి తనను ఎందుకు అరెస్టు చేసిందీ చెప్పాలని ఆమె అమిత్ షాను కోరారు.
తనను గృహ నిర్బంధంలో ఉంచిన తర్వాత ఇల్తిజా వాయిస్ మెసేజ్ పంపడం ఇది రెండవసారి. మొదటి వాయిస్ మెసేజ్లో ఆమె తన తల్లిని ఏకాంత నిర్బంధంలో ఉంచారనీ, న్యాయవాదులు, పార్టీ కార్యకర్తలను కలవనివ్వడం లేదనీ పేర్కొన్నారు. ‘నన్ను నేరస్థురాలిని చూసినట్లు చూస్తున్నారు. నోరు తెరిచి మాట్లాడిన మిగతా కశ్మీరీల లాగా నేను కూడా ప్రాణాలు పోతాయోమోనని భయపడుతున్నాను’ అని ఇల్తిజా రెండవ మెసేజ్లో పేర్కొన్నారు.
కశ్మీర్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా దాదాపు 400 మందీ రాజకీయ నాయకులు 12 రోజులుగా ప్రభుత్వ నిర్బంధంలో ఉన్నారు. ఫోన్ సర్వీసులు, ఇంటర్నెట్ పూర్తిగా నిలిపివేశారు. 50 వేల మంది పారా మిలటరీ బలగాల సిబ్బంది వీధుల్లో పహరా కాస్తున్నారు. లోయలో పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది.