ఓటర్లకు మురళీ మనోహర్ జోషి లేఖ
బీజేపీ నాయకత్వం తీరుపై ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎన్నికల్లో తన పోటీకి పార్టీ నిరాకరించడంపై బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తీవ్రంగా మండిపడ్డారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలలో తనను కాన్పూర్ లేదా మరెక్కడి నుంచి పోటీ చేయద్దని అధిష్ఠానం చెప్పిందని ఆయన అన్నారు. ఈ మేరకు కాన్పూర్ ఓటర్లకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. ఎల్.కె. అద్వానీ తర్వాత ఎన్నికల బరి నుంచి బీజేపీ తప్పించిన మరో సీనియర్ నాయకుడు ఎంఎం జోషి. అద్వానీ లాగే ఈయన కూడా పార్టీ పెద్దలు తనపట్ల వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రాంలాల్ ఈ సందేశాన్ని ఆయనకు పంపారు. పోటీ చేయబోనని ప్రకటించాల్సిందిగా జోషిని ఆయన కోరగా, అందుకు నిరాకరించారు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కనీసం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి తనకు తెలియజేయాలి కదా అని జోషి ప్రశ్నించినట్లు తెలిసింది.
కాన్పూర్ ఓటర్లను ఉద్దేశించి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. ‘‘ప్రియమైన కాన్పూర్ ఓటరులారా, నేను కాన్పూర్ లేదా మరెక్కడి నుంచి పోటీ చేయకూడదట. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి రాంలాల్ వచ్చి చెప్పారు’’ అని లేఖలో అన్నారు. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన జోషిపేరు యూపీ స్టార్ ప్రచారకుల జాబితాలో కూడా లేదు. 2014లో జోషి తన వారణాసి సీటును ప్రధాని మోదీ కోసం వదిలి, తాను కాన్పూర్ వెళ్లి అక్కడ భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పటికే అద్వానీ, కల్రాజ్ మిశ్రా, శాంత కుమార్, కరియాముండాలకు రాంలాల్ ఇదే తరహాలో సందేశం అందించారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రులైన కరియాముండా, శాంతకుమార్ లకు ఫోన్లు వచ్చాయి. పార్టీ వ్యవస్థాపక సభ్యులైన జోషి, అద్వానీ ఇద్దరికీ 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఐదుగురు సభ్యుల మార్గదర్శక బృందంలో మాత్రం చేర్చారు. అయితే ఈ బృందం ఐదేళ్లలో ఎన్నడూ సమావేశం కాలేదు.