(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యులు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మెజారిటీ సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. దిగువ సభలో డెమొక్రాట్లకు బలం ఉండడంతో తీర్మానానికి సులభంగానే సమ్మతి లభించింది. దీంతో సెనేట్లో ట్రంప్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. తీర్మానానికి అక్కడ కూడా ఆమోదం లభిస్తే అభిశంసన ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, సెనేట్లో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉండడం ట్రంప్కు ఊరటనిచ్చే అంశం.
అభిశంసన ప్రక్రియను నిలిపివేయాలంటూ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి ట్రంప్ ఇటీవల లేఖ రాశారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. జో బిడెన్పై దర్యాప్తు జరిపించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షునిపై ఒత్తిడి తెచ్చారనే అభియోగాలతో అభిశంసనకు గురయ్యారు ట్రంప్. దీంతో అమెరికా చరిత్రలో అభిశంసనకు గురైన మూడో అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిశంసన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు జోరందుకున్నాయి. నిరసన ప్రదర్శనలతో అమెరికా హోరెత్తిపోయింది. ట్రంప్పై అభిశంసన అభియోగాలపై అమెరికా ప్రతినిధుల సభలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే.. మరోవైపు అమెరికన్లు నిరసనలకు దిగారు. డొనాల్డ్ అధ్యక్ష పదవికి అనర్హుడంటూ..వెంటనే ఆయన్ను తొలగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే డిమాండ్తో ర్యాలీలు నిర్వహించారు. ట్రంప్కు అభిశంసన తప్పదని.. ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష పదవిలో కొనసాగడానికి వీల్లేదని నినాదాలు చేశారు.