(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రాజధానిపై సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతి ప్రాంత పరిధిలోని గ్రామాల రైతులు గురువారం ఉదయం నుంచి బంద్ నిర్వహిస్తున్నారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ దగ్గర రైతులు రిలే దీక్షలకు దిగారు. రాజధానిలోని 29 గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి గ్రామాల్లో రైతులు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. తుళ్లూరు, మందడం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. సచివాలయానికి వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. కొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా వాహనాలను పెట్టి రైతులు ఆందోళన చేస్తున్నారు. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
బంద్ నేపథ్యంలో స్వచ్ఛందంగా వ్యాపార, విద్యాసంస్థలను మూసివేశారు. మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.రాజధాని కోసం తమ విలువైన భూములు పణంగా పెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తే ఇప్పుడు తమను మోసం చేశారంటూ రైతులు మండిపడుతున్నారు.
మరోవైపు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 29 గ్రామాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ను అమలు చేశారు. ప్రజలు నిరసన తెలపాలనుకుంటే శాంతియుతంగా తెలపాలని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచించారు. బంద్లో పాల్గొనాలని ఎవరినీ ఒత్తిడి చేయొద్దని, అలాంటి పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బుధవారం నుంచి ఆందోళనలు చేస్తున్న రైతులు.. రాజకీయాల కోసం తమ జీవితాలతో ఆడుకోవద్దంటున్నారు. అమరావతిలోని మందడం, వెలగపూడి, రాయపూడి, కిష్టాయపాలెం రైతులు నిరసన చేశారు. మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అలాగే ఉద్దండరాయుని పాలెంలో అమరావతికి ప్రధాని మోదీ శిలాఫలకం వేసిన చోట రైతులు ఆందోళనకు దిగారు.