(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్పై అభ్యంతరకరమైన పోస్టింగ్ పెట్టాడంటూ ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టును అరెస్టు చేసి సుప్రీంకోర్టు చేతిలో చివాట్లు తిన్న ఉత్తరప్రదేశ్ పోలీసులు మరో జర్నలిస్టుపై ప్రతాపం చూపారు. షామ్లి జిల్లాలో రైలు పట్టాలు తప్పిన ఘటనను కవర్ చేసేందుకు ప్రమాదస్థలికి వెళ్లిన న్యూస్24 టివి ఛానల్ విలేఖరి అమిత్ శర్మను ప్రభుత్వ రైల్వే పోలీసులు దారుణంగా కొట్టారు. కాలితో తన్నారు. అనంతరం లాకప్లో రాత్రికి తన బట్టలు విప్పించారనీ, నోట్లో మూత్రం పోశారని అమిత్ ఆరోపించారు.
ప్రమాదస్థలిలో మఫ్టీలో ఉన్న రైల్వే పోలీసులు అమిత్ను ఎడాపెడా కొడుతున్న వీడియో బయటకు వచ్చింది. కొట్టవద్దంటూ అమిత్ వారిని ప్రాధేయయపడుతుండటం వీడియోలో కనబడుతుంది.
అమిత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియగానే సాటి జర్నలిస్టులు పోలీసు స్టేషన్కు వెళ్లారు. వారి నిరసనల ఫలితంగా అమిత్ను పోలీసులు బుధవారం ఉదయం విడుదల చేసారు. తాను వారిపై వేరే వార్తా కధనం చేశాననీ, ఆ కోపంతోనే తనపై దాడి చేశారనీ అమిత్ అంటున్నారు. తన మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారనీ, అందులో ఆ కథనానికి సంబంధించిన వీడియో ఫుటేజి ఉందనీ ఆయన చెప్పారు.
రైల్వే పోలీసు విభాగానికి సిబ్బందిని ఉత్తరప్రదేశ్ పోలీసులే అందిస్తారు. అమిత్ను కొట్టిన వీడియో బయటకు రాగానే పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. షామ్లి ప్రభుత్వ రైల్వే పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాకేష్ కుమార్, కానిస్టేబుల్ సంజయ్ పవార్లను సస్పెండ్ చేశారు.
#WATCH Shamli: GRP personnel thrash a journalist who was covering the goods train derailment near Dhimanpura tonight. He says, "They were in plain clothes. One hit my camera&it fell down. When I picked it up they hit&abused me. I was locked up, stripped&they urinated in my mouth" pic.twitter.com/nS4hiyFF1G
— ANI UP (@ANINewsUP) June 11, 2019
Video Courtesy: ANI