అమరావతి: మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటి ముందు ఆదివారం వెలుగు యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. రావాలి ఆర్కె, సమాధానం చెప్పాలి ఆర్కె అంటూ యానిమేటర్లు నినాదాలు చేశారు.
27 వేల మంది వెలుగు యానిమేటర్లను ప్రభుత్వం విధుల్లో నుండి తొలగించడంతో రాష్ట్ర వ్యాప్తంగా యానిమేటర్లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలను కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఏ ఒక్కరినీ ఉద్యోగాలను తొలగించనని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నామమాత్రపు వేతనాలతో పని చేస్తున్న తమను తొలగించడం దారణమని వారు పేర్కొంటున్నారు.
ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందజేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇంటి వద్ద యానిమేటర్లు నిరసన వ్యక్తం చేశారు.
పది నెలలుగా రావాల్సిన గౌరవ వేతనాలను ఇప్పించడంతో పాటు తమను ప్రభుత్వం కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.