హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఘటనలో ప్రజల హృదయాలను పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ శివారులోని చటాన్పల్లి వద్ద దహనమైన స్థితిలో ప్రియాంకరెడ్డి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నలుగురు లారీ డ్రైవర్లు ప్రియాంకరెడ్డిపై పాశవికంగా అత్యాచారం చేశారనీ. ఆమెను వదిలిపెడితే తమ నేరం బయటపడుతుందన్న ఉద్దేశంతో హతమార్చి ఆ తరువాత కిరోసిన్ పోసి దహనం చేశారనీ పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. నిందితులు మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. 70 శాతం కాలిపోయిన ప్రియాంకరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు సామూహిక అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించారు.
ఈ ఘటనపై మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రియాంకరెడ్డి దారుణ హత్య పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. ఈ దారుణానికి పాల్పడిన మృగాళ్లను తెలంగాణ డిజిపి, పోలీసులు త్వరగా పట్టుకుంటారన్న నమ్మకం ఉందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే 100కి డయిల్ చేయాలని కెటిఆర్ సూచించారు.
ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
Outraged and deeply anguished by the murder of #Priyankareddy I am confident that @TelanganaDGP & the police will catch the animals who committed this heinous crime & deliver justice at the earliest. I’ll personally monitor the case too. Anyone in distress, please dial 100 ? ?
— KTR (@KTRTRS) November 29, 2019