హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. సమ్మె ప్రారంభమై రెండు వారాలు అవుతున్నా ఎందుకు ఆపలేకపోయారని, సమ్మె నివారణకు తీసుకున్న చర్యలేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి పరిష్కారం చూపకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులని… వారు తిరగబడితే తట్టుకోలేరని వ్యాఖ్యానించింది. కార్మికులకు నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని న్యాయస్థానం సూచించింది.
దీనిపై అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కార్మికుల డిమాండ్లు నెరవేర్చడం సాధ్యం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి వల్లే ఎండీ నియామకం చేపట్టలేదని వివరించారు. అయితే ప్రభుత్వ వాదనపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని ప్రశ్నించగా.. దీనికి సమాధానంగా కొత్త ఎండీనీ నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఆర్టీసీకి సమర్థవంతమైన ఇన్ ఛార్జి ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఆయన సమర్థవంతుడు అయినప్పుడు… ఆయననే ఎండీగా నియమించవచ్చు కదా అని హైకోర్టు పేర్కొంది.