(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఎన్టీ రామారావు కుమార్తె పురందేశ్వరి భర్త అయిన డాక్టర్ దగ్గుబాటి ప్రస్థానం టిడిపి తర్వాత చాలా రకాలుగా మారింది. వైసిపిలో ఆయన మజిలీ కొద్దికాలంలోనే ముగిసిపోతున్నది. భార్యాభర్తలిద్దరూ చెరొక పార్టీలో ఉంటే ఎలా. పురందేశ్వరిని కూడా ఇటు తీసుకురండి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అల్టిమేటం లాంటి హెచ్చరిక జారీ చేయడంతో దగ్గుబాటి తాజా ప్రయాణం మొదలయింది. నిజానికి బిజెపి కూడా ఆయనకు కొత్తేమీ కాదు.
మామ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినపుడు ఆయనతో కలిసి నడవడం మినహాయిస్తే ఆ తర్వాత దగ్గుబాటి తీసుకున్న రాజకీయ నిర్ణయాలలో ఒక్కటి కూడా సరైనది కాదు. ఎన్టీఆర్పై తిరుగుబాటు చేసిన చిన్నల్లుడు చంద్రబాబు నాయుడు క్యాంప్కు వెళ్లడం దగ్గర నుంచి ఆయన ఊగిసలాడుతూ తీసుకున్న నిర్ణయాలు ఏవీ దగ్గుబాటికి రాజకీయంగా స్థిరత్వం ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు వైసిపిని వీడాల్సిరావడం మంచికేనని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెసెస్స్) నుంచి ఒక బృందం హైదరాబాద్లో దగ్గుబాటి ఇంటికి వెళ్లి ఆయనను కలిసినట్లు తెలిసింది. బిజెపిలో మంచి భవిష్యత్తు కల్పిస్తామని వారు ఆయనకు హామీ ఇచ్చారనీ, దగ్గుబాటి కూడా సానుకూలంగా స్పందించారనీ అంటున్నారు. భార్యతోపాటే తానూ బిజెపితో కలిసి నడవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బిజెపిలో చేరిన పక్షంలో తన రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని దగ్గుబాటి భావిస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ కుమార్తెను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న బిజెపి నాయకత్వం ఎన్టీఆర్ అల్లుడు, చంద్రబాబు తోడల్లుడు అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీలోకి వస్తే రాష్ట్రంలో టిడిపిపై తాము నైతికంగా పైచేయి సాధించనట్లవుతుందని భావిస్తున్నది.