అమరావతి: వరద ప్రమాదం పొంచి ఉన్నా ఇంకా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయకుండా ఇసుక బస్తాలను వేయిస్తూ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి ఆరోపించారు.
కృష్ణానదికి ఇంకా వరద ఎక్కువగా వస్తుందని అధికారులు చెబుతున్నారనీ, ఇప్పటికే చంద్రబాబు అక్రమ నివాసం రివర్ వ్యూ భవనం ముప్పావు వంతు మునిగిపోయిందనీ, నదిలోకి వెళ్లే వాక్ వే రెయిలింగ్ కూడా పూర్తిగా మునిగిపోయిందని ఆయన అన్నారు. చంద్రబాబు నివాసంతో పాటు కరకట్టపై అన్ని అక్రమ నివాసాల్లోకి వరద నీరు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆర్కే అన్నారు. వారందరూ స్వచ్చందంగా ఖాళీ చేస్తే తమకు ఇబ్బందులు ఉండవని ఆర్కే పేర్కొన్నారు.
కృష్ణానది నుండి సముద్రంలో కలిసేందుకు వెళుతున్న వరద నీరును పౌర్ణమి కారణంగా సముద్రం ఎగతన్నే అవకాశం ఉందని పల్లెకారులు చెబుతున్నారనీ, అదే గనుక జరిగితే నదీ తీర ప్రాంతంలో ముంపు అధికంగా ఉంటుందని ఆర్కే అన్నారు.