అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ వ్యవహారం మరొక సారి తెరపైకి వచ్చింది.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనలో అక్రమంగా డ్రోన్ కెమెరాలు వినియోగించారంటూ పోలీసులకు వైసిపి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైసిపి గుంటూరు లోక్సభ నియోజకవర్గం ఇన్చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి తుళ్లూరు డిఎస్పికి ఫిర్యాదు చేశారు.
వెలగపూడి, మందడం గ్రామాల మీదుగా చంద్రబాబు వెళ్లే సమయంలో అత్యంత భద్రత ప్రమాణాలు అమలులో ఉన్న సచివాలయం, అసెంబ్లీ, ముఖ్యమంత్రి కార్యాలయం మీదుగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ అనుమతి లేకుండ డ్రోన్ కెమెరాలను వినియోగించడం చట్టరీత్యా నేరమనీ ఇది గౌరవ ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల భద్రతకు ముప్పు కలిగించే అంశముగా పరిగణించి కేసు నమోదు చేయాలనీ అప్పిరెడ్డి కోరారు.
తాము తెలుసుకున్న సమాచారం మేరకు డ్రోన్ కెమెరాలను టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ నేతృత్వంలో టిడిపి నాయకులు వినియోగించి కుట్రపూరితంగా చిత్రీకరించారని పేర్కొన్నారు. దీని వెనుక దాగి ఉన్న కుట్రను ఛేదించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం వద్ద అక్రమంగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ చేశారంటూ అప్పుడు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. డ్రోన్ కెమెరాలను వినియోగించిన వ్యక్తులను చంద్రబాబు నివాసం వద్ద టిడిపి నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నాడు జలవనరుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతోనే నదీ ప్రవాహాన్ని పరిశీలించేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించారనీ, దీనికి పోలీసు ఉన్నతాధికారుల అనుమతి కూడా ఉందనీ మంత్రి అనిల్ కుమార్ వెల్లడించడంతో ఆ వివాదానికి తెరపడింది.
ఇప్పుడు తాజాగా టిడిపి నేతలపై డ్రోన్ కెమెరాలు అక్రమ వినియోగించారంటూ వైసిపి ఫిర్యాదు చేయడం గమనార్హం.