న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. శుక్రవారం లోక్ సభలో తన వ్యాఖ్యాలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఉగ్రవాదినంటూ తనపై ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెడితే అందుకు క్షమాపణ చెబుతున్నట్లు చెప్పారు.
‘న్యాయస్థానం నేను నిర్దోషినని ప్రకటించినా సభలోని ఓ సభ్యుడు(రాహుల్ గాంధీ) నన్ను ‘ఉగ్రవాది’ అని ఆరోపించారు. నా పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకే కొందరు నా వ్యాఖ్యలను తప్పుదోవ పటిస్తున్నార. మహాత్మాగాంధీపై తనకు గౌరవం ఉంద. ఎవరైనా నా వ్యాఖ్యలతో ఎవరినైనా బాధపెట్టి ఉంటే అందుకు క్షమాపణలు చెబుతున్నా’ అని ప్రజ్ఞా పేర్కొంది.
గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొంటూ నవంబర్ 27న లోక్ సభలో ప్రజ్ఞా వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యాల్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు. నాథూరాం గాడ్సేని భక్తుడంటూ వ్యాఖ్యానించిన ప్రజ్ఞా కూడా ఓ ఉగ్రవాదేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఉగ్రవాది ప్రజ్ఞా.. ఉగ్రవాది అయిన గాడ్సేను దేశభక్తడని అన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇదో దుర్దినం’ అని రాహుల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై సొంతపార్టీ నేతలతోపాటు విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజ్ఞా సింగ్ క్షమాపణలు కోరింది.
మరోవైపు ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై బీజేపీ అధినాయకత్వం కూడా సీరియస్ అయింది. రక్షణశాఖ కమిటీ నుంచి ఆమెను తొలగించారు. ప్రజ్ఞా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. బీజేపీ ఎప్పుడూ అటువంటి వ్యాఖ్యలను, ఐడియాలను మద్దతు ఇవ్వదన్నారు. పార్లమెంట్లో జరిగే అన్ని బీజేపీ సమావేశాల నుంచి ఆమెను వెలివేసినట్లు చెప్పారు. పార్లమెంట్ క్రమశిక్షణా సంఘం నుంచి కూడా ఆమెను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.