అమరావతి: అధికారం కోల్పోయినా చంద్రబాబు తీరు మార్చుకోలేదనీ, దీంతో టిడిపి నేతలు విసిగిపోతున్నారనీ వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆదివారం విశాఖ జిల్లాకు చెందిన అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు వైసిపిలో చేరిన సందర్భంలో విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరిన్ని ఆసక్తికర చేరికలు ఉంటాయని విజయసాయిరెడ్డి ప్రకటించారు. చంద్రబాబు వైఖరిపై అసంతృప్తిగా ఉన్న అనేక మంది టిడిపి కీలక నేతలు త్వరలో వైసిపిలో చేరనున్నారని చెప్పారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునే విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పులేదనీ, వారు ఆ పదవులకు రాజీనామా చేసి రావాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మిగతా వారు పార్టీలో చేరడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
రాజధాని అమరావతి విషయంలో అస్పష్టత ఏమీలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజధాని అంశంపై ఇంత వరకూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాట్లాడటం గానీ, మంత్రిమండలిలో దీనిపై చర్చించడం గానీ జరగలేదని విజయసాయిరెడ్డి అన్నారు. మీడియానే ఎక్కువగా ప్రచారం చేస్తుందేమోనని అనిపిస్తోందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజధానిపై వ్యతిరేకత ఏమిలేకపోయినా అక్కడ ఉన్న కష్ట నష్టాలను సరిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ దీనిపై ముఖ్యమంత్రే మాట్లాడాలని విజయసాయిరెడ్డి అన్నారు. విధివిధానాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యమంత్రి స్పందిస్తేనే ఆచరణ సాధ్యమవుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ద్వంద వైఖరితో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గతంలో అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని చెప్పిన వ్యక్తి నేడు యుటర్న్ తీసుకొని మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.