(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఒడిశాలో ఓ టీచర్… విద్యార్థులకు వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నాడు. కోరాపూట్ జిల్లాలోని ఓ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రఫుల్లా కుమార్ పాటి అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేకమైన బోధనా పద్ధతుల ద్వారా చదువు చెప్పినప్పుడే వారికి త్వరగా అర్థమవుతుందని ఆయన భావించాడు. దీంతో పిల్లలకు పాఠాలు వినూత్నంగా చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తాను డ్యాన్స్ చేస్తూ.. పిల్లలచేత కూడా డ్యాన్స్ చేయిస్తున్నాడు. పాఠాలను పాటల రూపంలో బోధిస్తున్నాడు. దీంతో పిల్లల్లో హుషారు వచ్చి చదువు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2008 నుంచి విద్యార్థులకు పాఠాలను.. పాటలు, డ్యాన్స్ల ద్వారా నేర్పిస్తున్నారు. దీంతో ఆయన ‘డ్యాన్సింగ్ మాస్టర్’గా మారిపోయారు. ప్రతిరోజు తాను ఈ విధంగానే విద్యార్థులకు పాఠాలు బోధిస్తానని టీచర్ ప్రఫుల్ల కుమార్ తెలిపారు. ఈ ప్రయోగం విద్యార్థుల శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ విధంగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టినప్పటి నుంచి విద్యార్థుల హాజరు శాతం కూడా బాగా పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన బోధినకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
https://www.facebook.com/prafullakumar.pathi/videos/1140852282768358/