వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ కు మరోసారి అమెరికా గట్టి షాకిచ్చింది. మసూద్ అజహర్ ముమ్మాటికీ అంతర్జాతీయ ఉగ్రవాదేనని తేల్చిచెప్పింది. అతడిని అలా చెప్పకపోవడం వల్ల ప్రాంతీయ సుస్థిరత, శాంతికి భంగమని తెలిపింది. జైషే మహ్మద్ చీఫ్ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కీలక సమావేశం జరగడానికి ఒక్కరోజు ముందు అమెరికా నుంచి ఈ తరహా ప్రకటన రావడం గమనార్హం.
ఇప్పటివరకు భారతదేశంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు సూత్రధారి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్. పార్లమెంటు మీద దాడి, పఠాన్ కోట్ వైమానిక స్థావరం మీద, జమ్ము, ఉరీ ప్రాంతాల్లో ఆర్మీ క్యాంపుల మీద దాడులకు అతడే మూలం. పుల్వామాలో ఇటీవల సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి చేయించి 40 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్నదీ అతడే.
ఇప్పటికే ఐరాస భద్రతామండలిలోని మూడు శాశ్వత సభ్యత్వదేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని తీర్మానం ప్రతిపాదించాయి. ఇంతకుముందు పలుమార్లు ఈ దిశగా చేసిన ప్రయత్నాలు.. చైనా జోక్యంతో వీగిపోయాయి. మండలిలో వీటో అధికారం ఉన్న ఐదు దేశాల్లో ఒకటైన చైనా.. ప్రతిసారీ మసూద్ పై నిషేధాన్ని వీటో చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగి, అతడిపై నిషేధానికి మద్దతు పలికింది. అజహర్ జైషే మహ్మద్ వ్యవస్థాపకుడని, అతడు అంతర్జాతీయ ఉగ్రవాది ముద్రకు తగినవాడేనని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో చెప్పారు.