- ఫేస్బుక్కు ఎన్నికల కమిషన్ ఆదేశం
- వర్ధమాన్ ఫొటో పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే
- రాజకీయ పోస్టరులో అభినందన్ ఫొటో
- ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మొదటి చర్య
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత కోడ్ ఉల్లంఘనకు సంబంధించి తొలి చర్య మొదలైంది. సోషల్ మీడియాను కూడా తాము వదిలేది లేదని ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి చెందిన ఢిల్లీ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ శర్మ.. యుద్ధ విమాన పైలట్ అభినందన్ వర్ధమాన్ ఫొటోను తన పోస్టరులో పెట్టారు. దాంతోపాటు మరో పోస్టరులో కూడా వర్ధమాన్ ఫొటో ఉంది. ఈ రెండింటినీ వెంటనే తీసేయాలని ఫేస్బుక్ యాజమాన్యాన్ని ఈసీ ఆదేశించింది.
ఈ మేరకు ఫేస్బుక్ ఇండియా, దక్షిణాసియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్ కు ఈసీ ఆదేశాలు జారీచేసింది. సివిజిల్ అనే యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. గత సంవత్సరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈసీ ఈ యాప్ ను ఉపయోగించింది. దీనిద్వారా పౌరులు ఈసీకి ఆధారాలతో నేరుగా ఫిర్యాదుచేయచ్చు. లోక్ సభ ఎన్నికలకు ఆదివారం షెడ్యూలు ప్రకటించడంతో ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ శర్మ.. యుద్ధ విమాన పైలట్ అభినందన్ వర్ధమాన్ ఫొటోతో కూడిన రెండు పోస్టర్లను తన ఫేస్బుక్ వాల్ మీద పెట్టారు. వీటిలో ఇంకా మోదీ, అమిత్ షా, తన ఫొటోలు పెట్టుకున్నారు. మోదీ వల్లే తక్కువ సమయంలో అభినందన్ వర్ధమాన్ తిరిగి వచ్చారని అందులో రాశారు. ఇది భారతదేశానికి పెద్ద దౌత్యవిజయమని చెప్పారు. మరో పోస్టరులో పాకిస్థాన్ లొంగిందని, మనదేశ వీరజవాను తిరిగి వచ్చాడని అన్నారు. ఈ రెండు పోస్టర్లపై సీవిజిల్ యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదు అందింది. దాంతో వెంటనే ఫేస్బుక్ యాజమాన్యానికి తాఖీదులు వెళ్లాయి. 2013 నుంచే సోషల్ మీడియాకు కూడా కోడ్ అమలవుతోంది గానీ, ఇంత కఠినంగా చెప్పడం మాత్రం ఇదే తొలిసారి.