అమరావతి, మార్చి 13: తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో పలువురు ముఖ్యనేతలు పార్టీని వీడి వైసిపిలో చేరడంతో పాటు కాంగ్రెస్, వైసిపిల నుండి పలువురు నేతలు టిడిపిలోకి రావడంతో గెలుపు గుర్రాలు ఎవరన్న దానిపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో కసరత్తు చేయాల్సివస్తున్నది. 135 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిత్వాలను దాదాపు ఖరారు చేశారు. ఆ నాయకులను ఎన్నికల ప్రచారాలను నిర్వహించుకోవాలని కూడా సూచించారు.
బొడ్డు భాస్కర రామారావును టిడిపిలోకి ఆహ్వనించి పెద్దాపురం సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి ఆ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంశాఖ మంత్రి చిన రాజప్పను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వంగవీటి రాధాకృష్ణ చేరికతో ఆయన్న బందరు పార్లమెంట్ నుండి నిలిపితే, బందరు ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొనకళ్ల నారాయణను పెడన అసెంబ్లీకి వెళ్లాలని సూచిస్తున్నట్లు సమాచారం.
మంత్రి ఘంటా శ్రీనివాసరావు అననకాపల్లి లేదా భీమిలి అసెంబ్లీ సీట్ల నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఘంటా ప్రాతినిధ్యం వహిస్తున్న బీమిలి స్థానం నుండి నారా లోకేష్ను పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఘంటాను పార్లమెంట్ పోటీ చేయించాలని పార్టీ భావిస్తున్నా ఆయన పార్లమెంట్కు పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం.