Chandra Babu: ఏపి ముఖ్యమంత్రి (AP CM) వైఎస్ జగన్మోహనరెడ్డి (YS Jagan Mohan Reddy) పై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (పట్టాభి) (Pattabhi) అసభ్యకర దూషణ, దానికి నిరసనగా వైసీపీ (YCP) శ్రేణులు టీడీపీ (TDP) కేంద్ర కార్యాలయంతో పాటు పలు జిల్లాల్లోని ఆ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం తేలిసిందే. ఈ దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష నిర్వహించగా మరో పక్క వైసీపీ శ్రేణులు జనాగ్రహ దీక్షలు చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు పరుష పదజాలంతో విమర్శలు చేయడం, ఆ వ్యాఖ్యలపై టీడీపీ ఎదురుదాడి నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏపిలో జగన్మోహనరెడ్డి పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని, మంగళవారం నాటి దాడులు, ఆ తరువాత పరిణామాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని చంద్రబాబు పేర్కొంటూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందం సోమవారం ఢిల్లీకి వెళుతోంది.
Chandra Babu: రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు…మోడీ, షా అపాయింట్మెంట్ల పై ఉత్కంఠ
రాష్ట్రంలో పరిస్థితులను వివరించేందుకు చంద్రబాబు సోమవారం ఢిల్లీ పర్యటన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రదాన మంత్రి మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర పెద్దలను చంద్రబాబు కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ అయితే ఖరారు అయ్యింది కానీ మోడీ, షా అపాయింట్మెంట్ లపై ఇంకా స్పష్టత రాలేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చంద్రబాబు ఏ మోహం పెట్టుకుని మోడీ, షాలను కలుస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తరవాత మోడీ, షాలపై చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు వారు ఏపికి వచ్చిన సమయంలో టీడీపీ శ్రేణులు వ్యవహరించిన తీరును వైసీపీ శ్రేణులు గుర్తుకు తెస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అమిషా తిరుమల శ్రీవారి దర్శనంకు వచ్చిన సమయంలో టీడీపీ శ్రేణులు ఆయన కాన్వాయ్ పై చెప్పులు విసిరేసి అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ అది ఆయన మనసులో ఇంకా ఉందని అంటున్నారు.
బీజేపీతో స్నేహహస్తం కోసమేనా..
రాష్ట్రంలో జరిగిన పరిణామాలను సాకుగా చూపుతున్నా చంద్రబాబు ఢిల్లీ పర్యటన వ్యూహం వెనుక వేరే కారణం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీతో స్నేహ హస్తం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఓ పక్క ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలను కలిసేందుకు చంద్రబాబు తరపున ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తుండగా, వీరి అపాయింట్మెంట్ లు ఖరారు కాకుండా ఉండేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రధాన మంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ లు ఖరారు కాకుండా సీఎం జగన్ వెనుతిరిగి వచ్చిన సందర్భంలో టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా అదే విధంగా జరిగితే ఆయనను విమర్శించవచ్చని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందు కోసం చంద్రబాబు బృందానికి అపాయింట్మెంట్ లు ఖరారు కాకుండా చూడాలని వైసీపీ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారుట. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.