నరసరావుపేట: ఎన్డిఏలోకి చంద్రబాబుకు తలుపులు మూసుకుపోయాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆధ్యంతం చంద్రబాబుపై విమర్శలు చేశారు.
చంద్రబాబు లాంటి అవకాశవాద నేత దేశంలో మరొకరు లేరనీ, రాజకీయ ప్రయోజనాల కోసం 1999 ,2014 పొత్తు పెట్టుకున్నారని అమిత్ షా విమర్శించారు. అలాగే 2004లో బిజెపి ఓటమి పాలు కాగానే చంద్రబాబు ఎన్డిఏ నుండి బయటకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇక ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారనీ, ఒకవేళ కాంగ్రెస్కు సీట్లు రాకపోతే ఆ పార్టీ వదిలేస్తారనీ అమిత్ షా ఎద్దేవా చేశారు. 2019 లో మళ్ళీ మోది ప్రభుత్వం వస్తుందనుకుంటే మా పంచన చేరేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారని అమిత్ షా పేర్కొన్నారు.
అమరావతి పేరుతో అవినీతి తప్ప ఒక్క నిర్మాణం అయినా జరిగిందా అని అమిత్ షా ప్రశ్నించారు. ఐదేళ్ళలో లోకేష్ను అభివృద్ధి చేశారు తప్ప రాష్టానికి ఏం చేశారని అమిత్ షా దుయ్యబట్టారు. బిజెపి అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
ఐదేళ్ళలో మోది సర్కార్ అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేసిందని అమిత్ షా చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన 14 హామీలలో 11 హామీలు నెరవేర్చమని ఆయన అన్నారు. రైల్వే జోన్ హామీని మోది ప్రభుత్వం నిలబెట్టుకుందని అమిత్ షా అన్నారు.
మోది ప్రభుత్వం ఏపికి ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చిందనీ, గడచిన డెబ్బై ఏళ్లలో ఏ ప్రభుత్వమూ ఇన్ని నిధులు ఇవ్వలేదనీ అమిత్ షా అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఏడు వేల కోట్ల రూపాయలు ఇస్తే చంద్రబాబు, ఆయన మంత్రులు దోచుకున్నారని అమిత్ షా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు 11 కేంద్ర విద్యాసంస్థలను ఇస్తే వాటికి కనీసం భూమి కూడా కేటాయించలేదని అమిత్ షా పేర్కొన్నారు.
దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలు జరుగుతున్నాయని అమిత్ షా అన్నారు. ఒక వైపు మోది ఉంటే మరోవైపు విలువలు లేని కూటమి ఉందని ఆయన పేర్కొన్నారు.