అమరావతి: ఈ నెల 14న మంగళవారం నిర్వహించతలపెట్టిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి నేటి సాయంత్రం వరకూ కేంద్ర ఎన్నికల సంఘం నుండి అనుమతి రాని పక్షంలో రేపు సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
క్యాబినెట్ సమావేశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రమణ్యం భేటీ అయ్యారు. సిఎస్గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎల్వి సుబ్రమణ్యం తొలి సారిగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మాట్లాడారు.
అనంతరం ఎల్వి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ క్యాబినెట్ సమావేశానికి సంబంధించి ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసి క్యాబినెట్ అజెండాను వివరించానని తెలిపారు. ఎన్నికల సంఘం నుండి కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఏమి చేయాలన్న అంశంపై కూడా ముఖ్యమంత్రితో చర్చించానని సిఎస్ తెలిపారు.
సాయంత్రంలోగా ఇసి నుండి అనుమతి రాని పక్షంలో కరువు, ఫోని తుఫాను, త్రాగునీటి సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు సాయంత్రం మూడు గంటలకు అధికారులతో సమీక్ష జరపనున్నట్లు సమాచారం.