అమరావతి: కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించవద్దు, చర్యలు తీసుకోవాలని జగన్ అదేశించారు.
ప్రజావేదిక హాలులో రెండవ రోజు కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ చోటు చేసుకోవడం దారుణమని జగన్ అన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను జగన్ ఆదేశించారు.
రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తిని అరికట్టేందుకు ఆగష్టు మాసంలో భారీ ఆపరేషన్ చేపట్టాలని జగన్ ఆదేశించారు. గంజాయిని సాగు చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపాలని జగన్ ఉన్నతాధికారులకు సూచించారు.
గంజాయి సాగు చేసే గిరిజనులను కాఫీ ప్లాంటేషన్ను పెంచేలా ప్రోత్సహించాలని జగన్ చెప్పారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల పట్ల అప్రమత్తంగా ఉండాలని జగన్ కోరారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి రాష్ట్రంలో బెల్ట్షాపులనేవి ఉండకూడదని జగన్ ఆదేశించారు.జాతీయ రహదారుల వెంట మద్యం అమ్మకుండా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. జాతీయ రహదారుల వెంట మద్యం షాపులను ఎత్తివేయాలని ఆయన ఆదేశించారు. ప్రత్యేక హోదా ఉద్యమ కేసులను ఎత్తివేయాలని జగన్ స్పష్టం చేశారు. డిజిపి గౌతం సవాంగ్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.