(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ “తాత్కాలిక ఏర్పాటు”ను తక్షణం రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్తో ఒక ఉత్తర్వు జారీ చేయించింది. ఈ ఆర్టికల్ ఏమిటో తెలుసుకుందాం.
అర్టికల్ 370 జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన తాత్కాలిక ఏర్పాటు. దీని వల్ల ఆ రాష్ట్రం సొంత రాజ్యాంగం ఏర్పాటు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఈ రాష్ట్రంపై పార్లమెంట్ అధికారాలు పరిమితమవుతాయి.
రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్ధిక వ్యవహారాలు, కమ్యునికేషన్లు మినహా జమ్ము కశ్మీర్కు వర్తించే ఎలాంటి చట్టం చేయాలన్నా పార్లమెంట్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.
దీని ద్వారా పౌరసత్వం, ఆస్థులు కలిగిఉండే హక్కు, ప్రాధమిక హక్కులు సహా అన్ని విషయాలలో జమ్ము కశ్మీర్ ప్రజలు తమకు ప్రత్యేకమైన చట్టాలకు లోబడతారు.
ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వం అనుమతి పొందాల్సిఉంటుంది.
యుద్ధం, విదేశీ దాడి సందర్భాలలో మాత్రమే జమ్ము కశ్మీర్లో కేంద్రం అత్యయక పరిస్థితిని విధించగలుగుతుంది. అంతర్గత కల్లోలాల సందర్భంగా జమ్ము కశ్మీర్ ప్రభుత్వం కోరినపుడు మాత్రమే అక్కడ అత్యయిక పరిస్థితి విధించగలుగుతుంది.