(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భాతరదేశం అగ్రభాగాన ఉన్న జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం చాల పెద్ద నిర్ణయం తీసుకుంది. బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఉన్నదే అయినా ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం దేశప్రజలను నిర్ఘాంతపరిచింది. అదనపు భద్రతా బలగాల మోహరింపు, అమరనాధ్ యాత్ర అర్ధాంతరపు రద్దు మొదలుకొని కొద్ది రోజులుగా జమ్ము కశ్మీర్లో కేంద్రం వేస్తున్న ఎత్తులు ఏదో జరగబోతున్నదన్న సూచనలు ఇచ్చాయి. అయితే తక్షణం అమలులోకి వచ్చేలా 370 ఆర్టికల్ను రద్దు చేస్తారని జమ్ము కశ్మీర్ ప్రజలు బహుశా ఊహించిఉండరు. ఈ ఆర్టికల్ రద్దయినందువల్ల అక్కడ ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి.
అర్టికల్ 370 జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన తాత్కాలిక ఏర్పాటు. దీని వల్ల ఆ రాష్ట్రం సొంత రాజ్యాంగం ఏర్పాటు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఈ రాష్ట్రంపై పార్లమెంట్ అధికారాలు పరిమితమవుతాయి. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్ధిక వ్యవహారాలు, కమ్యునికేషన్లు మినహా జమ్ము కశ్మీర్కు వర్తించే ఎలాంటి చట్టం చేయాలన్నా పార్లమెంట్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్కు అన్ని అధికారాలూ దఖలు పడతాయి.
జమ్ము కశ్మీర్ ప్రజలకు ఇంతకాలం ద్వంద్వ పౌరసత్వం ఉంటూవచ్చింది. బయటివారిని వివాహమాడితేనే వారికి ఈ సదుపాయం రద్దవుతుంది. ఇకమీదట జమ్ము కశ్మీర్ ప్రజలకు ఒక్క భారత పౌరసత్వమే ఉంటుంది.
జమ్ము కశ్మీర్కు ఇకమీదట ప్రత్యేక జెండా ఉండదు. భారత జాతీయ పతాకమైన మువ్వన్నెల జెండానే వారికీ వర్తిస్తుంది.
ఇంతవరకూ యుద్ధం, విదేశీ దాడి సందర్భాలలో మాత్రమే జమ్ము కశ్మీర్లో కేంద్రం ఆర్ధిక అత్యయక పరిస్థితిని విధించగలుగుతుంది. ఇకమీదట కేంద్రం అనుకున్నప్పుడు జమ్ము కశ్మీర్లో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించగలుగుతుంది.
ఇకమీదట జమ్ము కశ్మీర్లో మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలు కలుగుతుంది.
గతంలో సమాచార హక్కు చట్టం జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి వర్తించేది కాదు. ఇప్పుడా పరిస్థితి మారింది. అక్కడ కూడా ఆ చట్టం వర్తిస్తుంది.