అమరావతి: అన్నీ ప్రధానమంత్రికి చెప్పే చేస్తున్నామన్న విజయసాయి రెడ్డి మాట వైసిపి ప్రభుత్వానికి చివరికి ఇబ్బదికరంగా పరిణమించింది.
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు, రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష విషయంలో కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ రాష్ట ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్సూ వెళ్లింది. దానితో పాటు ఇవన్నీ కూడా ప్రధాని మోది, హోంమంత్రి అమిత్ షాలకు చెప్పే చేస్తున్నామంటూ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి మీడియా ముందు అన్నారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఈ అంశాలకు సంబంధించి వివరణ ఇవ్వాలని పిఎంఒ ఆదేశించడంతో శుక్రవారం వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ కల్లాంలు పిఎంఒకు వెళ్లి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంపై గతంలోనే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు మార్లు లేఖలు రాశారు. అయినా ప్రభుత్వం విద్యుత్ కంపెనీలకు టారిఫ్ సమీక్షపై లేఖలు రాయడంతో కొన్ని కంపెనీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై తొలుత హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. విద్యత్ కంపెనీల పిటిషన్లపై గురువారం విచారణ సందర్భంలో ఇరు వర్గాల వాదనలు పూర్తి కాకపోవడంతో ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
అదే విధంగా పోలవరం పనులకు రివర్స్ టెండరింగ్కు వెళితే పనుల్లో జాప్యం జరగడంతో పాటు వ్యయం కూడా పెరుగుతుందని పోలవరం ప్రాజెక్టు అధారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తొందరపడి రివర్స్ టెండరింగ్కు చర్యలు తీసుకోవద్దని తెలిపింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ నవయుగ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనుల పురోగతి, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, తదితర విషయాలపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని పోలవరం ప్రాజెక్టు అధారిటీని కేంద్రం ఆదేశించినట్లు తెలిసింది.
వైసిపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ప్రధాని మోది, హోంశాఖ మంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే పోలవరం ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్, పిపిఎల సమీక్ష చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి మొన్న ఢిల్లీలో పేర్కొన్నారు. దానిని తప్పు పడుతూ బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, విజయసాయి మాటలను తాను పిఎంవో దృష్టికి తీసుకువెళతానని అన్నారు.