గుంటూరు: లేటు వయసులో తల్లిదండ్రులుగా మారారు ఓ వృద్ధు దంపతులు. తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన యరమాటి మంగాయమ్మ అనే మహిళ… 74 ఏళ్ల వయసులో ఇద్దరూ ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చారు. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా వీరిని డాక్టర్లు బయటకు తీశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగానే ఉన్నారని గుంటూరు నగరంలోని నర్సింగ్ హోమ్ వర్గాలు తెలిపాయి. పిల్లలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఒక్కొక్కరూ 1.5 కిలోల చొప్పున బరువు ఉన్నారని ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ ఉమా శంకర్ బీబీసీతో చెప్పారు. ప్రస్తుతానికి మంగాయమ్మను, పిల్లలను ఆరు గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచామని వెల్లడించారు. వయసు పైబడిన మహిళలు పిల్లలకు జన్మనిచ్చినప్పుడు.. సాధారణంగా రొమ్ముపాలు ఇవ్వకుండా చూస్తామని, వేరే తల్లుల పాలు పడతామని ఆయన తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన యరమాటి సీతారామ రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962 మార్చి 22న వివాహమైంది. పెళ్లయి ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వారి ఆశ తీరకుండానే ఇద్దరూ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. అయినప్పటికీ మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలనే కోరిక బలీయంగా ఉంది. వారికి పొరుగున ఉండే ఒక మహిళ 55 ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి కావడంతో, తానూ పిల్లల కోసం ఆ పద్ధతిని ఆశ్రయించాలని మంగాయమ్మ నిర్ణయించుకున్నారు. నిరుడు నవంబరులో గుంటూరులోని ఒక నర్సింగ్ హోమ్కు మంగాయమ్మ దంపతులు వచ్చి ఐవీఎఫ్ నిపుణులైన డాక్టర్ ఉమాశంకర్ను కలిశారు. బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. మంగాయమ్మ మెనోపాజ్ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని.. మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) పద్ధతిలో ప్రయత్నం చేశారు. మొదటి సైకిల్లోనే వైద్యుల కృషి ఫలించింది. ఈ ఏడాది జనవరిలో మంగాయమ్మ గర్భం ధరించినట్లు తేలింది. అప్పటి నుంచి ఆమెను ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. స్కానింగ్లో మంగాయమ్మ గర్భంలో కవలలు ఉన్నట్లు తెలిసింది. 74 ఏళ్ల వయసులో మంగాయమ్మ కవలలకు జన్మనివ్వడం ప్రపంచ రికార్డు అని డాక్టర్ చెప్పారు.
సిజేరియన్ తర్వాత మంగాయమ్మ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన సమయం. ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎందరో డాక్టర్లను కలిసాం. గొడ్రాలు అని అందరూ అంటుంటే చాలా బాధలు పడ్డాం. ఇద్దరు బిడ్డలు కలగడం ఆనందంగా ఉంది. అంతా డాక్టర్ ఉమా శంకర్ చలువ’’ అంటూ వ్యాఖ్యానించారు.
మంగాయమ్మ భర్త యరమాటి సీతారామ రాజారావు కూడా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘చాలా సంతోషంగా ఉంది. అంతా డాక్టర్ల కృషి. మొదట్లో మేము కూడా చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయాం. అయినా ఈ డాక్టర్ గురించి విని ఓ ప్రయత్నం చేద్దామని వచ్చాము. రెండు నెలలకే గర్భం రావడంతో నమ్మకం కుదిరింది. గతంలో కొన్నిసార్లు అలానే జరిగి మళ్ళీ పోయేది. అందుకే 9నెలలుగా ఆస్పత్రిలో నే ఉన్నాం. ఈరోజు పిల్లలను చూసిన తర్వాత మా వాళ్ళు అందరూ నన్ను గొడ్రాజు అంటూ వేసిన ముద్ర పోయింది. పిల్లలు ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటాం’’ అంటూ చెప్పుకొచ్చారు.