హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన కేబినెట్ ను విస్తరించారు. మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటుదక్కింది. ఈసారి అనుభవజ్ఞులకు అవకాశం కల్పించారు. రాజ్ భవన్ లో సాయంత్రం 4 గంటలకు ఈ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఇద్దరు మహిళలకు కేబినెట్ లో చోటు దక్కింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావుతోపాటు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. తొలుత తన్నీరు హరీశ్ రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ పువ్వాడ అజయ్ ప్రమాణ స్వీకారం చేశారు.
కేటీఆర్ కు ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలు, హరీశ్ రావుకు ఆర్థిక శాఖను కేటాయించారు. మరోవైపు సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ, పువ్వాడకు రవాణా శాఖ, సత్యవతి రాథోడ్కు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు, గంగులకు బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ కేటాయించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖను అప్పగించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణతో మంత్రుల సంఖ్య 18కి చేరింది.