(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్నగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్న కామ్రేడ్లు.. తమ మద్దతును ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగనుంది. అయితే, ఈ సమయంలోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో సీపీఐ మద్దతు ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ కార్మిక వర్గాల నుంచి వ్యక్తమైంది. దీంతో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకోక తప్పలేదు. హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులను తొలగిస్తామన్న కేసీఆర్కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆదిలాబాద్లో ఏడో రోజు కార్మికుల సమ్మెలో పాల్గొన్న చాడ.. మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. ఇది రాచరికం కాదని.. ప్రజాస్వామ్యం అన్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులతో ఇప్పటికైనా చర్చలు జరపాలని.. వారి తరుపున చర్చలకు తాము సిద్దమని తెలిపారు. ఆర్టీసీని అప్పులపాలు చేసింది ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. కార్మికుల సమస్యకు సీపీఐ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని, సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని చాడ హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. దాదాపుగా అన్ని ఎన్నికల్లోనూ గులాబీ జెండాలు ఎగురవేసింది. అయితే, హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం సీపీఐ మద్దతు కోరింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీపీఐకి కొంత సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. హుజూర్ నగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీని ఓడించి.. ఈ సీటును కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపధ్యంలోనే కామ్రేడ్లను కలుపుకు వెళ్లడం కలిసొస్తుందని టీఆర్ఎస్ భావించింది. ఈ మేరకు పార్టీ పార్లమెంటరీ నేత కేకే నేతృత్వంలోని బృందం సీపీఐతో చర్చలు జరిపి పొత్తు ఖరారు చేసింది. కానీ ఇంతలోనే ఆర్టీసీ సమ్మె మొదలు కావడం.. అటు ప్రభుత్వం,ఇటు కార్మికులు ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సీపీఐ పునరాలోచనలో పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్కు మద్దతునిస్తే.. కార్మికుల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని భావించిన సీపీఐ..తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో హుజూనరగ్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కేటీఆర్, సహా పలువురు మంత్రులు, నేతలు తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా భారీగా ప్రచారం చేస్తోంది. దీంతో ఈ ఉపఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.