(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలనే అంశాన్ని సుప్రీం కోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన వేళ… అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రక్షణ కల్పించలేమని కేరళ మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం శాంతియుత వాతావరణ కోసమే కృషి చేస్తుందని, అందువల్ల ప్రస్తుతానికి దేవాలయం వద్ద పోలీసులను మోహరించకూడదని నిర్ణయించామని చెప్పారు.
ఈ నెల 16న అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకుంటానని చెప్పిన మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ని సున్నితంగా హెచ్చరించారు మంత్రి సురేంద్రన్. ‘మీ బల ప్రదర్శనకు శబరిమల లాంటి పుణ్య క్షేత్రాన్ని వేదికగా ఎంచుకోవద్దు. శబరిమల అయ్యప్ప దర్శనానికి రావద్దు, ఒకవేళ రావాలని నిర్ణయించుకుని.. పోలీస్ భద్రత కావాలనుకుంటే సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి’ అని మంత్రి సురేంద్రన్ వ్యాఖ్యానించారు. శనివారం నుంచి శబరిమల అయ్యప్ప సన్నిధానంలో మండల పూజలు ప్రారంభించేందుకు ఆలయం తలుపులు తెరుస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు నవంబర్ 16న శబరిమల అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తామని మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ ప్రకటించారు. తనతో పాటు మరికొందరిని తీసుకు వెళ్తానని తెలిపారు. శబరిమల వెళ్లి పూజలు చేసేందుకు మహిళలకు ప్రవేశం ఉందని, ఇందుకు వ్యతిరేకంగా ఎవరూ నిరసనలు చేయకూడదని పేర్కొన్నారు. శబరిమల కేసు తీర్పు విషయంలో ధర్మాసనం జాప్యం చేయకూడదని సాధ్యమైనంత త్వరగా తుది తీర్పు వెలువరించాలని కోరారు. గత ఏడాది అయ్యప్ప దర్శనానికి యత్నించిన తృప్తి దేశాయ్.. తిరువనంతపురం ఎయిర్ పోర్టు నుంచే వెనక్కి వెళ్లింది. ఆమెను శబరిమలకు తీసుకెళ్లేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. తృప్తి దేశాయ్ కి వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు నినాదాలు చేయడంతో ఆమె వెనుదిరిగింది.
ఇక, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గతేడాది ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్లపై గురువారం(నవంబర్ 14) సుప్రీంకోర్టు తీర్పు.. ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని మెజార్టీ న్యాయమూర్తులు నిర్ణయం తీసుకోవడంతో ఈ తీర్పు ఇచ్చింది. సమీక్ష పిటిషన్లన్నీ సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉంచింది. గతంలో ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు చంద్రచూడ్, జస్టిస్ నారిమన్ వ్యతిరేకించారు.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం పాటించాలన్నది ఆలయ సంప్రదాయం. కానీ దీనిపై కొందరు మహిళలు ఇది లింగ వివక్ష అంటూ, తమ ప్రాథమిక హక్కుకు భంగం కలుగుతోందంటూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత 2018 సెప్టెంబరు 28న నిషేధం ఎత్తేయాలంటూ తీర్పు ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అనంతరం ఈ ఏడాది జనవరిలో కొంత మంది మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. అయితే దీనిపై అప్పట్లోనే రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన సుప్రీం ధర్మాసనం శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం పరిశీస్తుందని గురువారం తీర్పు వెల్లడించింది.
ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన అంశాన్ని నిశితింగా పరిశీలిస్తున్నామని కేరళ సీఎం పినరాయి విజయన్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై మరింత స్పష్టత కావాలంటున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల విషయంలో ఉన్న సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే మహిళల ఆలయ ప్రవేశంపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోర్టు ఉత్తర్వులు ఏవైనా సరే అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు.