హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల జెఎసి శనివారం తలపెట్టిన బస్ రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి సమ్మె 43వ రోజుకు చేరుకున్నది. బస్సు రోకో నిర్వహించాలన్న ఆర్టిసి జెఎసి పిలుపు మేరకు కార్మికులు వేకువజాము నుండే డిపోల వద్ద నిరసనలకు దిగారు. ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే జెఏసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని బిఎన్ రెడ్డి నగర్లో హౌస్ అరెస్ట్ చేశారు. అదే విధంగా మరో జెఎసి నేత రాజిరెడ్డిని సైతం గృహ నిర్భంధం చేశారు. నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆర్టిసి కార్మికులు జెఎసి నేతల ఇళ్ల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
బస్రోకోకు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ పాత బస్తీ ఫారూఖ్నగర్ డిపో, ఫలక్సుమా డిపో, సిద్ధిపేట, వరంగల్లు రూరల్ జిల్లా నర్సంపేట డిపో తదితర డిపోల వద్ద ఆందోళనకు సిద్ధమైన కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.