ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత కొద్ది నిమిషాల్లోనే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి ఓటర్లు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని, అయితే, శివసేన బీజేపీని మోసం చేసిందని ఫడ్నవీస్ ఆరోపించారు. బీజేపీకి 105 సీట్లు ఇచ్చారని, ప్రభుత్వ ఏర్పాటు చేసే సమయంలో శివసేన 50:50 ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చిందని మండిపడ్డారు. సీఎం పదవిపై శివసేన చెబుతున్నట్లు బీజేపీ ఎలాంటి హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు కలిగిన కాంగ్రెస్ – ఎన్సీపీ – శివసేన కలసి.. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
బీజేపీని అధికారానికి దూరం చేయడమే ఆ మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ అని మండిపడ్డారు. అజిత్ పవార్ ఎన్సీపీ శాసనసభాపక్ష నేత కావడంతో ఆయనతో తాము చర్చలు జరిపామని ఫడ్నవీస్ వివరించారు. ఆయన మద్దతు ఇస్తామనడంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కూటమిలో కొనసాగలేనని, రాజీనామా చేస్తానని అజిత్ చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ దగ్గర సరిపడా సంఖ్యా బలం లేదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా సమర్పిస్తాని చెప్పారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి, వారిని లాక్కునే ప్రయత్నాలు తాము చేయబోమన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి మంచి పాలన అందిస్తాయని ఆశిస్తున్నానని ఫడ్నవీస్ తెలిపారు. అయితే, ఆ మూడు పార్టీల విధానాలు, సిద్ధాంతాలు వేర్వేరని… ఈ నేపథ్యంలో, పాలన ఎలా సాగుతుందో వేచి చూడాలని వ్యాఖ్యానించారు.