(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విశాఖపట్నం: రాజధానికి 1500 ఎకరాలు సరిపోతుందని సిపిఎం నేత బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనీ, అయితే అది చంద్రబాబు చెప్పిన విధంగా అవసరం లేదనీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధ్యక్ష తరహా పాలన సాగే దేశాల్లో రాజధానులు వేరువేరు చోట్ల ఉండవచ్చనీ, పార్లమెంటరీ డెమోక్రసీలో అలా కుదరదనీ అన్నారు. అమరావతే రాజధాని అంటూ ముక్కలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ నేతలు ప్రయత్నిస్తున్నారని రాఘవులు తెలిపారు.
ఆర్థిక దుస్థితి, రాజకీయ అల్లకల్లోలాలకు వ్యతిరేకంగా జనవరి ఎనిమిదవ తేదీన సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
విశాఖలో సిఎం జగన్ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజలను నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుతో ముడిపడి ఉందని రాఘవులు అన్నారు. దీనికి జగన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలన్నారు. నిజంగా జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుకుంటే రైల్వే జోన్, ఉక్కు పరిశ్రమ, సొంత గనులు, గిరిజన విశ్వ విద్యాలయాల కోసం ప్రయత్నం చేయాలని అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా చతికిలపడ్డారని రాఘవులు వ్యాఖ్యానించారు. బిజెపితో దోబూచులాడారనీ బిజెపితో దగ్గర అవుతున్న వారితో తాము దూరంగా ఉంటామనీ రాఘవులు స్పష్టం చేశారు.